నేటి నుంచి సింగరేణిలో సమ్మె

by  |
నేటి నుంచి సింగరేణిలో సమ్మె
X

దిశ,గోదావరిఖని : సింగరేణి బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్‌కు అప్పగించడంపై కార్మిక సంఘాల నాయకులు సింగరేణి యాజమాన్యంకు సమ్మె నోటీస్‌ను అందజేశారు. ఈ క్రమంలో రెండు అధికార పార్టీలకు చెందిన యూనియన్‌ను కూడా సమ్మెలో పాల్గొనడం ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా కార్మికుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే సింగరేణి సమ్మెపై యాజమాన్యం‌తో అన్ని కార్మిక సంఘాల నాయకులు జేఏస్ సీ గా ఏర్పడి రెండు సార్లు అధికారులతో నిర్వహించిన చర్చలు సైతం విఫలం కావడంతో, నేటి నుంచి 3రోజుల పాటు సింగరేణి‌లో కార్మికుల సమ్మె అనివార్యంగా మారింది. ఇప్పటికే సమ్మె చేయడం వల్ల జరిగే నష్టంపై సింగరేణి అధికారులు పలు మార్లు సమావేశాలు నిర్వహించారు. సమ్మె వల్ల జరిగే పరిణామాలపై జీఎంలతో కలిసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు చర్చించారు. అయితే నేటి నుంచి 9.10.11 వ తేదీలలో 3 రోజుల పాటు జరిగే సమ్మెపై యాజమాన్యం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సింగరేణి వ్యాప్తంగా 23 భూగర్భ గనులు 19 ఉపరితల గనులు ఉన్నాయి. మొత్తం సింగరేణి‌లో సుమారుగా 42 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కళ్యాణఖని-6, ఆసిఫాబాద్‌ జిల్లాలోని శ్రావణపల్లి బ్లాకు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్లాక్-3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాక్-3, లకు సింగరేణి సంస్థ సుమారు రూ.167 కోట్లు ఖర్చు చేసి అన్వేషణతో పాటు ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకుంది. ఈ తరుణంలో బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో నాలుగు బ్లాకులకు కేంద్ర ప్రభుత్వం వేలం‌కు ప్రకటన ఇచ్చింది. దీంతో ప్రైవేటు సంస్థలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ నెల 3, 6 తేదీల్లో సింగరేణి యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో గురువారం ఉదయం షిఫ్టు నుంచి 72 గంటల సమ్మెలోకి దిగేందుకు కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీనికి కార్మికుల నుంచి సైతం సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సింగరేణిలో సమ్మె అనివార్యం గా మారడంతో సింగరేణి సంస్థ సమ్మె చేయడం వల్ల జరిగే బొగ్గు ఉత్పత్తి నష్టాలపై కేంద్రానికి లేఖ రాయడంతో పాటు ఆయా బ్లాక్‌లలో చేపట్టిన అన్వేషణ పనులను వివరించినట్లు యాజమాన్యంతెలియజేస్తుంది. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని అధికారులుతెలియజేస్తున్నారు. ఇప్పటికే కరోనా బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపించగా కార్మికుల సమ్మెతో మరింత నష్టం చూపే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. సింగరేణిలో రోజుకు 2.55 లక్షల‌ టన్నులు ఉత్పత్తికి నష్టం జరగనుందని ఇక వేతనాల రూపంలో కార్మికులకు ఒక్కరోజు 12.6 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని దాదాపు రూ.76 కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లే ప్రమాదముందని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రైవేటు బొగ్గు బ్లాకుల‌తో సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకం..?

బొగ్గు బ్లాకుల వేలం వేసే ప్రతిపాదనలతో పాటు టెండర్‌లు వేసేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమవటం పట్ల సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 4 బ్లాకులను ఈ జాబితాలో చేర్చినా… భవిష్యత్తులో మిగిలిన వాటిపై ఈ ప్రభావం ఉంటుందని సింగరేణి కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. సింగరేణి కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసేలా ఉన్న ఈ నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. సాగు చట్టాల మాదిరిగానే కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల నిరసనలతో అయినా ప్రభుత్వం దిగిరాకపోతే కార్మికులతో కలిసి నిరవధిక సమ్మె చేసేందుకైనా సిద్ధమని జేఎస్ సీ గా ఏర్పడిన అన్ని కార్మిక సంఘాల నాయకులు సింగరేణి యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. సమ్మెతో ప్రయోజనం లేకపోతే బొగ్గు బ్లాకుల కోసం వచ్చే ప్రైవేటు వ్యక్తులను అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.


Next Story