ఆఖరిదైనా గెలుస్తారా? మూడో వన్డేలో మన అమ్మాయిలు ఏం చేస్తారో?

by Dishanational5 |
ఆఖరిదైనా గెలుస్తారా? మూడో వన్డేలో మన అమ్మాయిలు ఏం చేస్తారో?
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాపై ఏకైక టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించామన్న ఆనందం భారత మహిళల జట్టుకు ఎన్నో రోజులు లేదు. వరుసగా రెండు వన్డేల్లో ఓడి వన్డే సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియా 2-0తో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. నేడు ముంబై వేదికగానే ఆఖరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి భారత గడ్డపై సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఆసిస్ జట్టు భావిస్తున్నది. ఆసిస్‌కు ఇది నామమాత్రపు మ్యాచే అయినా.. భారత్‌కు మాత్రం కీలకమే. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు కాపాడుకోవాల్సి పరిస్థితి నెలకొంది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం కోసం తీవ్రంగానే శ్రమించింది. కానీ, కీలక సమయాల్లో పట్టు కోల్పోవడంతో మ్యాచ్‌లను చేజార్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి, ఆఖరి వన్డేలో భారత జట్టు నుంచి ఆస్ట్రేలియా తీవ్ర పోటీ ఎదుర్కోవడం ఖాయమే. విజయమే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్ సేన పంతంతో మైదానంలో అడుగుపెట్టనుంది. మరోవైపు, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తుండటం ఆస్ట్రేలియాకు కలిసివస్తోంది. ఇప్పటికే సిరీస్ దక్కించుకోవడంతో ఆసిస్ క్రికెటర్లు ఆత్మవిశ్వాసంతో ఆఖరి పోరు బరిలో నిలువన్నారు. ఈ క్రమంలోనే నేడు ఆఖరి వన్డే ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

హర్మన్‌ప్రీత్ ఫామ్ అందుకునేనా?

భారత జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథిగా అద్భుతంగా జట్టును నడిపిస్తున్నా.. ప్లేయర్‌గా మాత్రమ ఆమె ఫామ్ ఆందోళన కలిగిస్తున్నది. ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన ఆమె.. రెండు వన్డేల్లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. మిడిలార్డర్‌లో కీలకమైన 4వ స్థానంలో ఆమె నిరాశపర్చడం జట్టుపై ప్రభావం చూపుతుంది. నేటి మ్యాచ్‌లోనైనా ఆమె పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక, యాస్తికా భాటియా, స్మృతి మంధాన జట్టుకు శుభారంభం అందించడంపై ఫోకస్ పెట్టాలి. మంచి ఫామ్‌లో ఉన్న రిచా ఘోష్, రోడ్రిగ్స్, భారత్‌కు ప్రధాన బలంగా ఉన్నారు. బంతితో సత్తాచాటుతున్న దీప్తి శర్మ బ్యాటుతోనూ మెరవాల్సి ఉంది. ఆమెతోపాటు పూజ, అమన్‌జోత్ బ్యాటుతో సరైన భాగస్వామ్యం నెలకొల్పకపోవడంతో బ్యాటింగ్ పరంగా భారత్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నది. నేటి మ్యాచ్‌లో వీరి నుంచి జట్టు మంచి ప్రదర్శన ఆశిస్తున్నది. బౌలింగ్ పరంగా కూడా భారత్ మెరగవ్వాల్సి ఉంది. దీప్తి శర్మ నిలకడగా రాణిస్తుండగా.. రేణుక, పూజ, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ పరుగుల కట్టడితోపాటు వికెట్లు తీయాల్సి ఉంది. మరోవైపు, ఆసిస్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్నది. ఓపెనర్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ భీకర ఫామ్‌లో ఉండగా.. కెప్టెన్ హీలీ, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్ సైతం నిలకడగా రాణిస్తుండటంతో భారత బౌలర్లకు పరీక్ష తప్పదు.

తుది జట్లు(అంచనా)

భారత్ : యాస్తికా భాటియా, స్మృతి మంధాన, రిచా ఘోష్, రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, పూజ వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, స్నేహ్ రాణా, రేణుక సింగ్.

ఆస్ట్రేలియా : లిచ్ ఫీల్డ్, హీలీ(కెప్టెన్), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, మెక్‌గ్రాత్, గార్డ్‌నెర్, సదర్లాండ్, వారేహమ్, అలానా కింగ్, కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్.


Next Story

Most Viewed