వలస కూలీల కోసం ప్రత్యేక విమానం..

by  |
Sonu sood
X

న్యూఢిల్లీ : రీల్‌ లైఫ్‌లో విలన్ కావొచ్చు కానీ, రియల్‌ లైఫ్‌లో నిజమైన హీరో అంటూ పలువురి ప్రశంసలు పొందుతున్నాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ఇటీవల వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అతను ఈసారి మరో ముందడుగు వేశాడు.ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు పొంది వందలాది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చిన ఆయన తాజాగా, కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా వలస కూలీల కోసం ఏకంగా విమానాన్నే ఏర్పాటు చేయించాడు. 177 మంది వలస కూలీలను గాలి మోటార్‌లో వారి స్వగ్రామాలకు తరలించాడు. వాళ్లందరూ మహిళా కూలీలే కావడం గమనార్హం. వివరాల్లోకివెళితే..ఒడిశాకు చెందిన మహిళ కూలీలు కేరళ రాష్ట్రంలోని కొచ్చికి వలసొచ్చి ఓ ఫ్యాక్టరీలో ఎంబ్రాయిడరీ, కుట్టుమిషన్ పనులు చేస్తుండేవారు.లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమ మూతపడటంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని భువనేశ్వర్‌లోని తన మిత్రుడి ద్వారా తెలుసుకున్న సోనూ వారి కోసం స్పెషల్ విమానాన్ని సిద్ధం చేశాడు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి, ఎయిర్‌పోర్టు అథారిటీలతో సంప్రదింపులు జరిపి 177 మందిని సొంతూళ్లకు పంపించాడు.ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ ఎంపి అమర్ పట్నాయక్ సోనూపై ప్రశంసల వర్షం కురిపించారు. వలస శ్రామికుల పట్ల సోనూ సూద్ కనబరుస్తున్న ప్రేమ, వారికి అందిస్తున్న సాయంపై చాలా మంది నెటిజన్లు కీర్తిస్తున్నారు.

Next Story

Most Viewed