వందేళ్లను పూర్తి చేసుకున్న సింగరేణి.. ఎప్పుడు.. ఎలా స్టార్టయిందో తెలుసా?

by  |
Singareni-1
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: సిరుల మాగాణి.. తెలంగాణ కొంగు బంగారంగా ఉన్న సింగరేణి వందేళ్లను పూర్తి చేసుకుంది. శతాబ్దం క్రితం ప్రారంభమైన సింగరేణి కాలరీస్ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో కష్టనష్టాలను అధిగమించి దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. ఎంతోమందిని అక్కున చేర్చుకుని జీవితాలను ప్రసాదించింది. నల్లసూరీళ్ల కష్టంతో ఎన్నో రాష్ట్రాలకు వెలుగులు నింపుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఎత్తుపల్లాలనూ ఎదుర్కొంది. తట్ట, చెమ్మాస్ నుంచి అత్యాధునిక సాంకేతికతతో ముందుకు సాగుతోంది. కార్మికుల సంక్షేమం కోసం తనకు తానుగా ఎన్నో మార్పులు చేసుకుంది. రాష్ట్ర సాధన అనంతరం లాభాల బాటలో పరుగులు తీస్తుంది. ప్రపంచాన్నే కుదిపేసిన కరోనా నల్లనేలనూ తాకింది. అయినా తేరుకుని మళ్లీ పరుగులు పెడుతోంది.

భద్రాద్రి రామయ్య దర్శనానికి వెళ్తూ..

దేశంలో తెల్లదొరలు పాలిస్తున్న రోజులవి.. ఆ రోజుల్లో భద్రాద్రి రామున్ని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులు ఎడ్ల బండ్ల మీద ప్రయాణం సాగిస్తుండేవారు. వారు మార్గమధ్యంలో ఆగి వంటలు వండుకుని, విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ వారి ప్రయాణం కొనసాగించేవారు. ఇలా ప్రయాణం సాగించిన ఈ బంధం సింగరేణి గ్రామం వద్ద విశ్రాంతి తీసుకుని వంట చేసుకోవడానికి అక్కడక్కడ ఉన్న నల్లని రాళ్లు, కర్రపుల్లలతో పొయ్యి వెలిగించారు. అప్పుడు ఆ రాళ్లు మండుతూ కనిపించాయి. భయబ్రాంతులకు గురైన ఆ బంధం మొదట ఏవో అతీత శక్తులు ఉన్నాయని భావించి సమీపంలో ఉన్న క్రిస్టియన్ మిషనరీ వాళ్లకు తెలిపారు. ఈ అద్భుతాన్ని చూసిన మిషనరీ నిర్వాహకులు సమాచారాన్ని పై అధికారులు తెలిపారు. అప్పుడు బ్రిటిష్ అధికారులు రంగంలోకి దిగి బొగ్గు అన్వేషణ సాగించినట్లు చరిత్ర చెబుతోంది.

మొదట హైదరాబాద్ దక్కన్ కంపెనీగా..

ఆ సమయంలో అధికారిగా ఉన్న డాక్టర్ విలియం కింగ్ 1871లో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ ప్రారంభించాడు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ అన్వేషణ, పరిశోధనల అనంతరం బొగ్గుట్ట(ఇల్లెందు)లో బొగ్గు తవ్వకాలు మొదలు పెట్టారు. మొదట దీనికి హైదరాబాద్ దక్కన్ కంపెనీగా పేరు నమోదు చేసి ఇగ్లాండ్ లో కేంద్ర కార్యాలయాన్ని నెలకొల్పారు. 1920లో ప్రధాన కార్యాలయాన్ని మద్రాస్ కు మార్చారు. డిసెంబర్ 23న అప్పుడున్న దక్కన్ పేరును తొలగించి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా నామకరణం చేశారు. ఇలా స్థాపించబడిన సింగరేణి ఇంతింతై వటుడింతై అన్నట్టు దినదిన ప్రవర్థమానంగా కొనసాగుతూ ఆదిలాబాద్ జిల్లాకు 1927లో విస్తరించింది. అప్పుడు ఆ జిల్లాలో ఉండే తాండూరులో మొదట బొగ్గు తవ్వకాలు ప్రారంభించారు. అపారమైన బొగ్గు నిల్వలున్న గోదావరి పరివాహక ప్రాంతాన్ని విలియం కింగ్ ఒక పంటగా అభివర్ణించారు. తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.

హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ అధీనంలోకి..

బొగ్గు గనులు ఆవిర్భవించిన సుమారు 45 రోజులపాటు బావుల్లో నీరు, గాలి, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు లేవు. అయినా మన కార్మికులు తెల్లదొరలకు లాభాలు గడించి పెట్టారు. 1036లో కొత్తగూడెంలోని బర్లిఫిట్, ఆండ్రూస్, 2ఇంక్లైన్ బావుల్లో బొగ్గు తవ్వకం ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత భారత ప్రభుత్వం ఆధీనంలో సింగరేణి కొనసాగింది. అప్పటి నుంచి దాదాపు 350 కి.మీ మేర బొగ్గు తవ్వకాలు జరుపుతూ ఎన్నో రాష్ట్రలకు బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా లాభాల బాటలో పయనిస్తోంది సింగరేణి. వందేళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తగూడెంలోని కేంద్ర కార్యాలయంతోపాటు అన్ని ఏరియాల్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటోంది.


Next Story

Most Viewed