8న నగరానికి సీఎం కేసీఆర్.. వచ్చినవెంటనే సమీక్షా సమావేశం..!

by  |
Chief-Minister-KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన బుధవారం ముగిసి అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్ రానున్నారు. వచ్చిన తర్వాత దళితబంధుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నది. శాసససభలో చర్చ, చట్టబద్ధత కల్పించే కసరత్తుపై అధికారుల నుంచి వివరాలను తీసుకోనున్నారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయం పనులు ఎంతవరకు వచ్చాయో జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైతే స్వయంగా సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నది. మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి ఇప్పటికే నాలుగున్నర టీఎంసీల నీరు చేరినందున లాంఛనంగా నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కృష్ణా జలాల విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో జరిగిన చర్చలు, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం, ఇటీవల విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్న అంశాల్లో ఉన్న అభ్యంతరాల ప్రస్తావన తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులందరికీ వివరించే అవకాశం ఉన్నది. గెజిట్‌లో పేర్కొన్నట్లుగా అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్ళడంలో ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులపై కేంద్ర మంత్రికి వివరించిన కేసీఆర్ మరికొంత గడువు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బోర్డులకు సహకరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరిన విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా సభ్యులకు వివరించే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు సాగునీటి అంశాలపై మీడియా ద్వారా వెల్లడించనందున అసెంబ్లీ వేదికను ఇందుకోసం వాడుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది.


Next Story

Most Viewed