ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఇది కొవిడ్ రోగుల పరిస్థితి!

by  |
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఇది కొవిడ్ రోగుల పరిస్థితి!
X

దిశ, తెలంగాణ బ్యూరో; కరోనా వ్యాధి నుంచి పేషెంట్లను కాపాడేందుకు డాక్టర్లు హైడోస్ ఉన్న స్టెరాయిడ్ లను వినియోగిస్తున్నారు. దీంతో వ్యాధి నుంచి కోలుకున్న పేషేంట్లకు కొత్తగా బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే స్టెరాయిడ్ లను ఎక్కువగా వినియోగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఆక్సిజన్ అందించే హ్యూమిడిఫైర్లను నిత్యం శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. అధిక మందులు వినియోగిస్తేనే ప్రాణాలు నిలిచే అవకాశం ఉండటం, హ్యూమిడిఫైర్లను తొలగించి శుభ్రం చేసే సమయం లేకపోవడంతో కరోనా పేషేంట్ల పరిస్థితి ముందు నుయ్యి వెనకగొయ్యిలా తయారైంది.

వెంటాడుతున్న బ్లాక్ ఫంగస్..

కరోనా వ్యాధి తీవ్రత పెరిగిన పేషేంట్లను కాపాడేందుకు డాక్టర్లు అధిక డోస్ లు ఉన్న స్టెరాయిడ్ లను, ఆక్సిజన్ వినియోగిస్తున్నారు. పేషేంట్ల ప్రాణాలు కాపాడేందుకు మోతాదుకు మించి ఇంజెక్షన్ అందిస్తున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వ్యాధి వెంటాడుతోంది. ఎక్కువగా రోజుల తరబడి ఆక్సిజన్‌ను వినియోగించిన పేషెంట్లకు ముకోర్మైకోసిస్ ఫంగస్ సోకుతుంది. ఆక్సిమీటర్ లో భాగమైన హ్యూమిడిఫైయర్‌ ను శుభ్రం చేయకపోవడం వలన ముకోర్మైకోసిస్ అనే ఫంగస్ ఉత్పన్నమవుతుంది. ఈ ఫంగస్ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి బ్లాక్ ఫంగస్ గా మారుతుంది.

అధిక స్టెరాయిడ్లు వాడొద్దని డాక్టర్ల సూచన..

కరోనా పేషెంట్లకు వినియోగిస్తున్న స్టెరాయిడ్ లను అధిక మోతాదులో వినియోగించరాదని డాక్టర్లు సూచిస్తున్నారు. పేషేంట్ల వయసు, ఆరోగ్య పరిస్థితులను బట్టి సరైన సమయంలో తగినంత ఉపయోగించాలని చెప్తున్నారు. అధిక పరిమాణంలో ఎలాటి గైడ్ లెన్స్ ని పాటించకుండా పేషేంట్లకు ఇవ్వరాదని తెలిపారు. వీటితో పాటు హ్యూమిడిఫైర్లను నిత్యం శుభ్రపరచాలని సూచించారు. పేషేంట్ల కు బ్లాక్ ఫంగస్ సోకినట్టుగా తెలిస్తే ప్రాథమిక దశలోనే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్‌మెంట్ చేయడం వలన కాపాడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఫంగస్ తీవ్రంగా ఉన్న వారికి యాఫోటెరిసన్​ ‘బీ’ వంటి యాంటీ ఫంగల్​ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు.

అధిక స్టెరాయిడ్లు వాడితేనే నిలుస్తున్న ప్రాణాలు..

కరోనా పేషెంట్ల శరీరంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధిక స్టెరాయిడ్ లు తప్పనిసరిగా వినియోగించాలి వస్తుంది. నిరంతరం ఆక్సిజన్ ను సప్లై చేయాల్సి వస్తుంది. ఆక్సిజన్ అందడం నిమిషం ఆలస్యమైనా ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితులతో ఆక్సిజన్ ను తొలగించి హ్యూమిడిఫైర్లను శుభ్రం చేసే సమయం కూడా ఉండటం లేదు. కరోనా పేషేంట్ల తాకిడి పెరగడంతో ఆక్సిజన్ బెడ్లు దొరకడమే కష్టంగా ఉంది. అలాంటిది ప్రతిరోజు ఆక్సీ మీటర్లను మార్చే పరిస్థితి కానీ సమయం కానీ ఆసుపత్రి సిబ్బందికి లేదు. దీంతో చికిత్సలు అందిస్తే బ్లాక్ ఫంగస్ సోకుతుంది. తగినంత మందులు ఇవ్వకపోతే ప్రాణాలు పోతున్నాయి.

Next Story