Mamata Banerjee Vs K.C.R :మమతా బెనర్జీ తాజా నిర్ణయం.. కేసీఆర్‌కు చెక్ పెట్టడమే వ్యూహమా?

by Disha Web Desk 12 |
Mamata Banerjee Vs K.C.R :మమతా బెనర్జీ తాజా నిర్ణయం.. కేసీఆర్‌కు చెక్ పెట్టడమే వ్యూహమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ సారి వింటర్ సెషన్ హాట్ హాట్ గా సాగే అవకాశాలు ఉన్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకోబోతున్నాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం విపక్షాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాల విషయంలో, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే విషయంలో ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని విపక్ష కూటమి లో ఎప్పటి నుంచో ఓ చర్చ జరుగుతోంది. కానీ తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభా సమన్వయం విషయంలో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయించుకోవడం చర్చగా మారింది.

జాతీయ, రాష్ట్ర అంశాల విషయంలో బీజేపీ ప్రభుత్వం పై దాడి చేయాలని అయితే కాంగ్రెస్ తో మాత్రం కలవకూడదని ఆ పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ లో సంఖ్య పరంగా నాలుగో స్థానంలో ఉన్న టీఎంసీ.. కాంగ్రెస్ తో దూరం పాటించాలనే నిర్ణయం భవిష్యత్ లో విపక్షాల ఐక్యత విషయంలో ఓ ఇండికేషన్ ఇస్తుందా అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే విపక్షాల ఐక్యత లోని డొల్లతనం బయటపడింది. అదే సమయంలో మమతా బెనర్జీ యూ టర్న్ తీసుకున్నారనే చర్చ జరిగింది. ఇటీవల ఆమె నిర్ణయాలు బీజేపీకి చేరువగా ఉంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో టచ్ మి నాట్ అన్నట్టుగా వ్యవహరించాలనే మమతా వ్యూహం ప్రతిపక్ష కూటమిలో సవాలుగా మారే ఛాన్స్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. జీవ వైవిధ్య సవరణ బిల్లు, అటవీ సంకర్షణ సవరణ బిల్లు, నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కమిషన్ బిల్లు, కంటోన్మెంట్ బిల్లు, కోస్టల్ ఆక్వా కల్చర్ బిల్లులు ప్రధానమైనవిగా ఉన్నాయి. మరో వైపు వీటిలో జీవ వైవిధ్య, బహుళ రాష్ట్రాల సహకార సంఘాలు, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే మరో 16 అంశాలపై చర్చించాలని పట్టుబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి టీఎంసీ దూరంగా ఉండాలనే నిర్ణయం వెనుక మమతా బెనర్జీ ఎలాంటి రాజకీయ వ్యూహం ఉండబోతోందనేది ఆసక్తిగా మారుతోంది.

కేసీఆర్ కు షాక్ తప్పదా..?

నిజానికి మమతా నిర్ణయాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది. కేసీఆర్ సైతం జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రమేయం లేని కూటమి దిశగా కేసీఆర్ ఆలోచన ఇదివరకే ప్రకటించారు. అయితే విపక్షాలన్నీ ఏకం కాకుండా ఢిల్లీ రాజకీయాలను ఒంటిచేతితో ఏలాలనుకోవడం అసాధ్యం. అయితే ఎవరి నేతృత్వంలో విపక్షాల కూటమి ఉండాలనేది ప్రధానమైన సమస్యగా మారింది. దీంతో విపక్ష కూటమి లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇది ఆయా సందర్భాల్లో బహిర్గతం అవుతూనే వస్తోంది.

ఈ క్రమంలో పార్లమెంట్ లో సంఖ్య పరంగా నాలుగో స్థానంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీ కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ ఆ స్థానంలో తాము చేరుకునే ప్రయత్నాలు చేస్తోందనే వాదన వినిపిస్తోంది. అదే జరిగితే ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ కు మమతా బెనర్జీ రూపంలో చక్రం అడ్డుతగులుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విపక్షాల కూటమి వ్యవహారం అంతా రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి జరిగే ముచ్చటే అయినా ఇప్పటి నుంచే ఆయా పార్టీలు లెక్కలు వేసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇందులో ఎవరు ఎవరికి ఝలక్ ఇస్తారు అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.


Next Story

Most Viewed