బిల్కిస్‌ బానో కేసు.. వివాదాస్పదమైన Smita Sabharwal రియాక్షన్!

by Disha Web Desk 2 |
బిల్కిస్‌ బానో కేసు.. వివాదాస్పదమైన Smita Sabharwal రియాక్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్‌ బానో సామూహిక లైంగిక దాడి కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయింది. ఈ అంశం ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇక తెలంగాణలోనూ ఈ టాపిక్ దుమారం రేపుతోంది. మహిళలను ఉద్దేశించి ప్రసంగాలు చేసే ప్రధాని నరేంద్ర మోడీ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన 11 మంది దోషులను విడుదల చేయడం ఏంటని టీఆర్ఎస్ నిలదీస్తోంది. రాజకీనేతల మాటలు ఎలా ఉన్నా.. తెలంగాణకు చెందిన ఓ సీనియర్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన వరుస ట్వీట్లు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. సాధారణ ఆఫీసర్లు స్పందిస్తే ఇంత చర్చ జరగకపోయి ఉండేదేమో. కానీ, స్పందించిన వ్యక్తి తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి. అందులోనూ అమె ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయ కార్యదర్శిగా పని చేస్తున్న స్మిత సబర్వాల్ కావడం ఆసక్తిగా మారింది.

వరుస ట్వీట్లతో చర్చ:

ఈ ఇష్యూలో స్మితా సబర్వాల్ చేసిన వరుస ట్వీట్లు సంచలనంగా మారాయి. రేపిస్టుల విడుదల నమ్మలేకపోయానని ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా ఆందోళన చెందానని ఆమె ట్వీట్ చేశారు. ఇదంతా చూస్తుంటే మనం స్వేచ్ఛాయుత దేశంలోనే ఉన్నామా? అంటూ ప్రశ్నించారు. వరుస ట్వీట్లు చేస్తూ.. సివిల్ సర్వీస్‌లో ఉంటున్న తమకు కూడా మాట్లాడే హక్కు ఉంటుందని సూటిగా ట్వీట్లు చేయడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) రూల్స్ 1964లోని రూల్ 9లో పేర్కొన్న విధంగా స్మిత ప్రభుత్వ ఉద్యోగుల భావప్రకటనా స్వేచ్ఛను ప్రస్తావించడం హాట్ టాపిక్ అయింది.

చిక్కుల్లో స్మితా సబర్వాల్?

స్మతా సబర్వాల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. దోషుల విడుదల విషయంలో ఆమె సెలెక్టివ్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో అనేక మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు స్పందించని స్మితా సబర్వాల్ ఓ మతం ఆధారంగా స్పందిస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణలో ఎంతోమంది అమాయక మహిళలు, యువతులు దారుణంగా బలయ్యారని అలాంటి ఘటనల సమయంలో స్మితా సబర్వాల్ కనీసం స్పందించలేదని విమర్శిస్తున్నారు. ఓ వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని ఆమె ట్వీట్లు ఉన్నాయని.. ఆమెను సివిల్ సర్వీస్ నుండి తొలగించాలని మరి కొంతమంది డిమాండ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దేశంలో స్వేచ్ఛ లేకుంటే స్మితా సబర్వాల్ దేశం విడిచి వెళ్లాలని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు ఆమెను టీఆర్ఎస్ సింపథైజర్ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరి కొందరేమో మీరు రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మొత్తంగా బిల్కిస్ బానో కేసుపై స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్లను సర్వీస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందా? అనే కోణంలో చర్చ జోరందుకుంది. కొంత మంది నిబంధనలకు విరుద్దంగా ఆమె ట్వీట్లు ఉన్నాయని ఆరోపిస్తుండగా.. వాటిని సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా ఎలా చూస్తారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. స్మితా ఎలాంటి విమర్శలకు తావివ్వలేదని ఈ విషయంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం చూసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story