పసికందు తల్లిని గుర్తించిన పోలీసులు

by  |
పసికందు తల్లిని గుర్తించిన పోలీసులు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:

ముక్కు పచ్చలారని పసికందును రోడ్డు పక్కన వదిలివెళ్లిన తల్లిని పోలీసులు గుర్తించారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇసామియా బజార్‎లో సోమవారం తెల్లవారుజామున జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది ఆడ శిశువును గుర్తించి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. స్థానికులను విచారించడంతో పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం సరస్వతి అనే వివాహిత బీదర్ నుంచి హైదరాబాద్‎కు వచ్చింది. సరస్వతికి ఇప్పటికే ఒక కొడుకు ఉండగా భర్తను వదిలి తల్లితో కలిసి నగరానికి వచ్చింది. ఇక్కడికి వచ్చే సమయానికే ఆమె గర్భవతి కాగా, ఆదివారం ఇంట్లోనే ప్రసవించింది. ఆడపిల్ల పుట్టడంతో పెంచడం భారమని తలిచి జన్మనిచ్చిన గంటల వ్యవధిలోనే రోడ్డు పక్కన వదిలేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా పసికందు తల్లిని గుర్తించిన పోలీసులు.. సరస్వతిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి కోఠి ప్రసూతి ఆస్పత్రిలో ఉందని.. తల్లి మానసిక ఆరోగ్యం కూడా బాగాలేదని ఇన్‎స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed