చుట్టాలూ.. మీరు మా ఇంటికి రాకండి..

by  |
చుట్టాలూ.. మీరు మా ఇంటికి రాకండి..
X

దిశ, న్యూస్ బ్యూరో:
హలో..
ఆ.. హలో..
ఏడున్నవు.. ఇంట్లనా, ఆఫీసుల్నా..?
ఇంట్లనే ఉన్న… చాలా రోజులుగా ఇంటి నుంచే వర్క్ చేస్తున్న
ఐతే ఓకే… ఆఫీసుకు వెళ్తున్నట్లయితే ఊరికి రావద్దని ఫోన్జేసిన

హైదరాబాద్ ఉండేవారికి ఇప్పుడు బంధుమిత్రుల పలకరింపులు ఇలాగే ఉంటున్నయి. క్షేమ సమాచారానికి బదులుగా ఇంటి నుంచి పని చేస్తున్నవా? ఆఫీసుకు వెళ్తున్నవా? అనే ప్రశ్నతోనే మొదలుపెడుతున్నరు. ఊరి నుంచి అన్నా, అక్కా, అమ్మ, బాపు, మామ ఎవరు ఫోన్ చేసినా ఇదే తీరు. ఆప్యాయతల కంటే వైరస్ వ్యాప్తి భయమే వారిని వెంటాడుతోంది. ఊరికి రానిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ‘‘వైరస్ మన చుట్టూ వల పన్నింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా దాని బారిన పడడం ఖాయం. సన్నిహితుల నుంచే వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’’ అనే భావనే ఎక్కువవుతోంది. అందుకే బంధుత్వాలు, ఆప్యాయతలను కూడా పక్కన పెడుతున్నారు. తొలుత చాలా సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. కోవిడ్-19 విశ్వరూపం చూశాక ‘వర్క్ ఫ్రం హోం’ను అమలు చేస్తున్నాయి. ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పని చేసేందుకు ఇష్టపడుతు న్నారు.

మీరెవరూ రావద్దు

లాక్డౌన్ కాలంలో కొన్ని గ్రామాల ప్రజలు బారికేడ్లు అడ్డం పెట్టి, గోడలు కట్టి కొత్త వ్యక్తులు రాకుండా నియంత్రించుకున్నరు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లేం మార్గాలను దాదాపుగా మూసేసిండ్రు. ఇప్పుడేమో ‘‘మా ఇంటికి రావద్దని, మా కాలనీకి రావద్దని’’ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నరు. హైదరాబాద్లోని ముషీరాబాద్ పద్మశాలి కాలనీలో ఇంటింటికీ ఇలాంటి ఫ్లెక్సీలు వెలిశాయి. ఇంకొందరేమో కరపత్రాలను అంటించిండ్రు. శ్రావణమాసం మొదటి మంగళవారం పసుపు, కుంకుమ పంపిణీని మహిళలు వాయిదా వేసుకుంటున్నరు. గ్రామీణ ప్రాంతాల్లో దుకాణాల సమయాన్ని కుదించుకుంటున్నరు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా సోకింది. అంతే.. తెల్లారి నుంచి ఊరిలో లావాదేవీలు ఉదయం 11 గంటల వరకేనని పంచాయతీ దండోరా వేయించింది. చింతపల్లి మండలం మాల్ లో కరోనాతో ఓ వ్యాపారి చనిపోయాడు. దీంతో వ్యాపార సమయాన్ని మధ్యాహ్నానికే పరిమితం చేశారు. మద్యం దుకాణాలు కూడా అదే సమయాన్ని పాటించాలని ఆదేశించారు. పల్లెల్లో కట్టడికి అనేక చర్యలు చేపడుతున్నారు. మునుపెన్నడూ లేని ఐక్యతను ప్రదర్శిస్తున్నారు. .

జాగ్రత్తగా ఉండేందుకే: రాజాపేట ఆంజనేయులు, ముషీరాబాద్ పద్మశాలి కాలనీ ప్రధాన కార్యదర్శి
కరోనా వైరస్ ప్రమాదకారే. అందుకే మా ఇళ్లల్లోకి రావద్దని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం ఎవరి దగ్గరికీ వెళ్లే పరిస్థితులు లేవు. తెలంగాణలో ‘‘మేరేకూ కుచ్ నహీ హోతా.. దేఖింగే’’ అనే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే వలస కార్మికులను ఆదుకున్న మేమే సేవకు కూడా అవకాశం లేదన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. బంధుత్వాలు, ఆప్యాయతలను కొద్ది కాలం తగ్గించుకోవాలి. బ్యానర్లు కట్టుకున్నాక కాలనీకి వచ్చేవారి సంఖ్య కూడా తగ్గింది. మా కాలనీని చూసి గుంటూరు జిల్లాలో కొందరు శ్రావణ మాసం పూజలు కూడా ఎవరింట్లో వారే చేసుకోవాలని నిర్ణయించారు. వాళ్లు కూడా మా ఇంటి పూజకు మిమ్మల్ని ఆహ్వానించడం లేదంటూ బ్యానర్లు కట్టారు. ఎవరికి వారు కట్టడి చేసుకోవాల్సిందే.

Next Story