తెలంగాణలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగు

by  |
Paddy Cultivation
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో రైతులు 55 లక్షల ఎకరాలలో వరి సాగు చేపట్టారు. ఎకరానికి 27 క్వింటాళ్ల చొప్పున దాదాపుగా కోటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఎఫ్‌సీఐ ఇప్పటికే చేసుకున్న ఒప్పందం ప్రకారం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనుంది. ఇతర రాష్ట్రాలకు 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతి కానున్నాయి. మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం ఎఫ్‌సీఐ అధికారులతో సంప్రదింపులు చేపట్టనున్నారు. ఇక మిగిలిన 50లక్షల మెట్రిక్ టన్నలు ధాన్యం రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలకు వినియోగించబడనున్నాయి. మంగళవారం ధాన్యం దిగుబడుల అంశంపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మార్కెటింగ్ పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ, ఎఫ్ సీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుండి ధాన్యాన్ని సేకరించే కర్ణాటక, తమిళనాడు, కేరళలలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నాయని తెలిపారు. పంజాబ్‌లో పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నా అక్కడ వినియోగం అంతగా లేదని పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం ఉత్పత్తులు వచ్చే సమయానికి రాష్ట్రంలో ఇప్పటికే నిలువ ఉన్న గత యాసంగి ధాన్యం నిల్వలను ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎఫ్సీఐకి సూచించారు. ధాన్యం నిలువల కోసం బహిరంగ ప్రదేశాల్లో ధాన్యం స్టోరేజికి చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో గోదాంల నిల్వ సామర్థ్యం పెంచేందుకు త్వరలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెటింగ్ శాఖ వద్ద 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధంగా ఉందని ఆసక్తి గల వారికి నిర్మాణ ఖర్చులో సబ్సిడీ ఇస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ సామర్ద్యం వచ్చే అవకాశం ఉందని వివరించారు.

కర్ణాటక, తమిళనాడు, కేరళలలో దొడ్డు వడ్ల వినియోగం తగ్గిన నేపథ్యంలో ఈసారి ఎఫ్‌సీఐ దొడ్డు వడ్లను సేకరించడంలేదని ఎఫ్‌సీఐ జీఎం దీపక్ శర్మ సమావేశంలో వెల్లడించారు. కాబట్టి రైతాంగం యాసంగిలో దొడ్డు రకం వడ్లను సాగు చేయొద్దని సన్న రకాలనే సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత మేరకు వరి సాగును తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయంగా వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు వంటి తక్కువ పెట్టుబడి అయ్యే నూనెగింజల పంటల సాగు మూలంగా రైతాంగానికి లాభం ఉంటుందని తెలిపారు. యాసంగిలో వడగండ్ల వానలు, అకాల వర్షాలు, గాలివానలతో రైతులు పంటలు నష్టపోకుండా మార్చి 31 లోపు పంటలు కోతకు వచ్చేలా చూసుకోవాలన సూచించారు.

మార్చి 31 తర్వాత ఉష్ణోగ్రతల మూలంగా నూక శాతం పెరిగి మిల్లింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో గోదాంల సమస్య తీవ్రంగా ఉందని అన్ని గోదాంలు రాష్ట్రంలో ధాన్యం, ఇతర పంటలతో నిండుగా ఉన్నాయని తెలిపారు. ఇవి వానాకాలం పంటలు వచ్చే నాటికి ఖాళీ అయ్యే అవకాశం తక్కువగా ఉందని వివరించారు.


Next Story

Most Viewed