'నిమ్స్' నర్సుకు కరోనా పాజిటివ్

by  |
నిమ్స్ నర్సుకు కరోనా పాజిటివ్
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా పాజిటివ్ పేషెంట్లకు వైద్య చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి, ఇతర మెడికల్ టీమ్ సభ్యులకూ ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. అనేక రాష్ట్రాల్లోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు చోటుచేసుకుంటుండగా.. ప్రస్తుతం రాష్ట్రంలోని ‘నిమ్స్’లో కూడా చోటుచేసుకుంది. ఈ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో పనిచేస్తున్న ఒక స్టాఫ్ నర్సుకు పాజిటివ్ వచ్చినట్లు రెండు రోజుల కిందట నిర్ధారణ అయింది. వెంటనే సంబంధిత విభాగాధిపతి ఆ నర్సును గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంతకాలం ఆమెతో పనిచేసిన నర్సులను క్వారంటైన్‌కు పంపే విషయంలో నిమ్స్ డీన్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 13వ తేదీన ఆమె డ్యూటీలో తిరిగి జాయిన్ అయిన తర్వాతి రోజు మెడికల్ ఓపి విధులు కూడా నిర్వహించారు. ఆ తర్వాతి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో డాక్టర్ సూచన మేరకు ఆమె కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ 17వ తేదీన అడ్మిట్ అయిన తర్వాత లక్షణాలను పరిశీలించిన వైద్యులు ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించుకుని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆ ప్రకారం జరిగిన పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

నిజానికి గత నెల 16వ తేదీన ఆమె ఒక పేషెంట్‌కు జరిగిన కోలోస్టోమీ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజే ఆమెకు జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు వచ్చాయి. మరుసటి రోజు (మార్చి 18)న గాంధీ ఆస్పత్రికి వెళ్ళి డాక్టర్‌తో తన లక్షణాలు అనుమానంగా ఉన్నాయని వివరించి, కరోనా పరీక్ష చేయించుకున్నారు. కానీ రిపోర్టు నెగెటివ్ అని వచ్చింది. అయినా ఆమె గాంధీ ఆస్పత్రి డాక్టర్ల సూచన మేరకు 15 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ విధంగా మార్చి 18 నుంచి ఈ నెల 12 వరకు లీవ్‌లో ఉండి, మళ్ళీ 13వ తేదీన విధుల్లో చేరిన తర్వాతనే ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చి చివరకు పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని నిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం ప్రొఫెసర్ ఒకరు డీన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేసి, తదుపరి చర్యలపై నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నర్సుకు పాజిటివ్ అని తేలినందున కుటుంబ సభ్యులతో పాటు నిమ్స్‌లో గత నాలుగు రోజులుగా పనిచేసిన స్థలాల్లో తోటి నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వివరాలను సేకరించే ప్రక్రియ మొదలైంది. అవసరాన్ని బట్టి వారిని క్వారంటైన్‌కు తరలించడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇప్పటికే నీలోఫర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఒక చిన్నారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో 15వ తేదీ రాత్రి షిప్టు నుంచి 17వ తేదీ రాత్రి షిప్టు వరకు డ్యూటీలో ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, హౌస్ సర్జన్లు, పోస్టుగ్రాడ్యుయేట్ డాక్టర్లు, నర్సులు.. ఇలా వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు తరలిస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలియజేశారు. ఇప్పుడు నిమ్స్‌లో కూడా అలాంటి పరిస్థితి నెలకొననుంది.

Tags: Telangana, NIMS, Corona, Nurse, Positive

Next Story

Most Viewed