రైలు పట్టాలపై బిడ్డకు జన్మనిచ్చిన ఏనుగు.. 2 గంటలు ఆగిన రైలు..

by Phanindra |

రైల్వే పట్టాలపై ఏనుగు తన బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో 2 గంటలపాటు రైలును ఆపేశారు.

రైలు పట్టాలపై బిడ్డకు జన్మనిచ్చిన ఏనుగు.. 2 గంటలు ఆగిన రైలు..
X

దిశ, నేషనల్ బ్యూరో: అమ్మతనం ఏ జీవికైనా అద్భుతమే. ఆ గొప్పదనాన్ని ఎవరు అందుకుంటున్నా, అందుకున్నా.. వారిని గౌరవించడం మన సంప్రదాయం. ఈ నమ్మకాన్ని భారతీయ రైల్వే రుజువు చేసింది. జార్ఖండ్‌లో ఒక రైలు వేగంగా వస్తున్న సమయంలో.. రైలు పట్టాల పక్కనే ఒక గర్భిణీ ఏనుగు తన బిడ్డకు జన్మనిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ట్రైన్ డ్రైవర్, రైల్వే అధికారులు.. ఆ తల్లికి భంగం కలగకూడదని రైలు ఆపేశారు. ఏనుగు బిడ్డకు జన్మనిచ్చేవరకు వెయిట్ చేశారు.

రెండు గంటల తర్వాత ఏనుగు తన బిడ్డను కని, గున్నతోపాటు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయిన తర్వాత రైలును కదిలించారు. దీనికి సంబంధించిన వీడియోను పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘ఎప్పుడూ మనుషులు, జంతువుల మధ్య సమస్యలే కనిపించే సమయంలో.. ఈ అన్యోన్యమైన ఘటనను పంచుకోవడం సంతోషంగా ఉంది. జార్ఖండ్‌లోని ఒక ట్రైన్.. ఒక ఏనుగు డెలివరీ కోసం రెండు గంటలు వెయిట్ చేసింది.

ఆ రెండు జీవాలు సంతోషంగా నడుచుకుంటూ వెళ్లిపోయిన తర్వాతే ట్రైన్ కదిలింది’ అని ఆయన పేర్కొన్నారు. తన శాఖ ఎంతో కృషి చేసి 3500 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లను పరిశీలించి, 110 సెన్సిటివ్ స్పాట్లను గుర్తించిందని ఆయన చెప్పారు. ఈ శ్రమకు ఇలా ఫలితం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ తల్లి సురక్షితంగా తన బిడ్డకు జన్మనిచ్చేందుకు చర్యలు తీసుకున్న జార్ఖండ్ అటవీశాఖను కూడా భూపేంద్ర యాదవ్ అభినందించారు.

Next Story