పట్టపగలే సైనికుడి కిడ్నాప్.. ఉగ్రవాదుల పనేనా ?

by Dishanational4 |
పట్టపగలే సైనికుడి కిడ్నాప్.. ఉగ్రవాదుల పనేనా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌లో శాంతిభద్రతలు ఇంకా గాడిన పడలేదు. తాజాగా శుక్రవారం మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో కొందరు దుండగులు చెలరేగారు. కోన్సమ్ ఖేదా సింగ్‌ అనే ఆర్మీ జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జేసీఓ)ను ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కోన్సమ్ ఖేదా సింగ్‌ ప్రస్తుతం సెలవులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు చరంగ్‌పట్ మమంగ్ లైకై గ్రామంలోని జేసీఓ ఇంటి వద్దకు చేరుకున్న కొంతమంది దుండగులు.. తుపాకీ ఎక్కుపెట్టి అతడిని ఒక వాహనంలో తీసుకెళ్లారు. సింగ్ కుటుంబానికి గతంలోనూ పలుమార్లు కిడ్నాప్ బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈసారి కిడ్నాప్ ఎందుకు జరిగింది అనే విషయం తెలియరాలేదు. సాక్షాత్తూ ఆర్మీలో పనిచేసేవారికే మణిపూర్‌లో భద్రత లేదని ఈ ఘటనతో తేటతెల్లమైంది. జేసీఓ కోన్సమ్ ఖేదా సింగ్‌ కోసం అన్ని భద్రతా సంస్థలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దుండగులు వాహనంలో వెళ్లిన మార్గంలో తనిఖీలను పెంచారు. సెర్చ్ ఆపరేషన్ కూడా జరుగుతోంది. అయితే ఈ ఘటన వెనుక ఉగ్రవాదులు ఉన్నారా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

మరెన్నో ఘటనలు..

మణిపూర్‌లో కొన్ని నెలల క్రితం హింసాకాండ మొదలైనప్పటి నుంచి ఆర్మీ సిబ్బందిని దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం ఇది నాలుగోసారి. గతేడాది సెప్టెంబరులో అస్సాం రెజిమెంట్ మాజీ సైనికుడు సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ను గుర్తు తెలియని సాయుధులు కిడ్నాప్ చేసి చంపేశారు. గతేడాది నవంబర్‌లో ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఓ సైనికుడి నలుగురు కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి దుండగులు చంపేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) స్థాయి అధికారి ఇంటిపై దుండుగులు దాడిచేసి ఆయనను కిడ్నాప్ చేశారు.

Next Story

Most Viewed