అరుణాచల్‌ ప్రదేశ్‌లో జలప్రళయం.. కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు.. అసోంకు ముప్పు! (వీడియో)

by Ramesh Naini |   (  Updated:2026-06-24 09:19:37  IST  )

అరుణాచల్‌ప్రదేశ్‌లో కురిసిన అతిభారీ వర్షాలు జలప్రళయాన్ని సృష్టించాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో జలప్రళయం.. కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు.. అసోంకు ముప్పు! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: అరుణాచల్‌ప్రదేశ్‌లో కురిసిన అతిభారీ వర్షాలు జలప్రళయాన్ని సృష్టించాయి. ముఖ్యంగా కేయీ పన్యోర్, లోయర్ సుబన్‌సిరి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ సంభవించాయి. యాజలి, పోసా, యీయీ గ్రామాలు వరద నీటిలో మునిగిపోగా, ఇళ్లు, వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోసాలోని ఎన్‌ఈఈపీసీఓ కాలనీలో 15 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. ఒక ప్రధాన రహదారి వంతెన కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

భారీ వర్షపాతం తక్కువ సమయంలోనే కురవడంతో నదుల నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. పలువురు స్థానికులు గల్లంతైనట్లు సమాచారం ఉండగా, సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు, అరుణాచల్‌లోని వరదల ప్రభావంతో దిగువ ప్రాంతమైన అసోంలోనూ వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షపాతం.. ప్రాణనష్టం లేదు!

మంగళవారం ఉదయం నాటికి యాజలి ప్రాంతంలో 72.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య కురిసిన కుండపోత వర్షం వల్ల స్థానిక డ్రైనేజీ వ్యవస్థలు స్తంభించి, నదులు ఒక్కసారిగా ఉప్పొంగాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నివేదించబడలేదు. అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

Next Story