సుప్రీంలో RRR పంచాయితీ.. పోటాపోటీ వాదనలు.. వకీల్ సాబ్ సీన్ రిపీట్!

by  |
supreme court
X

దిశ, వెబ్‌డెస్క్ : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సంబంధించిన కేసులో సుప్రీంలో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఎంపీను పోలీసులు కొట్టారని ఆయన తరఫు లాయర్ ముఖుల్ రోహత్గి వాదించగా, గుంటూరు జీజీహెచ్, సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వచ్చిన మెడికల్ రిపోర్టుల్లో అలాంటిది ఏమీ లేదని వెల్లడైనట్లు సీఐడీ లాయర్ దష్యంత్ దవే వాదించారు. అయితే, ఎంపీ కాలి వేలుకు గాయమైనట్లు రిపోర్టులో రాగా దాని గురించి పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. ప్రస్తుతం రఘురామ కండీషన్ బాగానే ఉందని, ఆయనకు ఏమీ దెబ్బలు తగల్లేదు కావున పిటిషన్ కొట్టివేయాలని దవే సుప్రీంను కోరారు. ఎంపీ హద్దులు మీరడంతో పాటు ఏపీలో క్రిస్టియన్లు, రెడ్ల మధ్యలో గొడవలు తలెత్తేలా వ్యాఖ్యలు చేశారని అందుకే కేసు నమోదు చేసినట్లు దవే కోర్టుకు వివరించారు.

వెంటనే కలుగజేసుకున్న ముఖుల్ రోహత్గి రఘురామ అధికార పార్టీ లోపాలను ఎత్తి చూపడంతో పాటు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం వల్లే కుట్రపూరితంగా ఆయన మీద సీఐడీ అధికారులు కేసు పెట్టారని రోహత్గి వాదించారు. అయితే, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ఎంపీ తరఫు న్యాయవాది కోరగా, ఇది సీబీఐకు ఇవ్వాల్సిన కేసు కాదని సీఐడీ లాయర్ దవే స్పష్టంచేశారు. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధంలేని అంశాలను కోర్టులో ప్రస్తావించొద్దని దవే రోహత్గికి సూచించారు. తాను చెప్పదల్చుకున్నవే చెబుతానని రోహత్గీ తెలపడంతో ఇరు లాయర్ల మధ్య వాగ్వాదం చెలరేగింది.

కోర్టు హాల్లో తలెత్తిన దృశ్యాలు ఇటీవల రిలీజైన పవన్ మూవీ వకీల్ సాబ్ సీన్‌ను తలిపించాయి. మధ్యలో బెంచ్ కలుగజేసుకుని ఇరువురు సీనియర్ లాయర్లు ఘర్షణ పడొద్దని వాదించింది. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడులు రేపేందుకు ఎంపీ యత్నించారని సీఐడీ లాయర్ చెప్పగా.. మాట్లాడటం, విమర్శలు చేస్తే రాజద్రోహం కిందకు రాదని రోహత్గీ కోర్టుకు వివరించారు. ఎంపీపై కేసు పెట్టడం ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం లాంటిదే, ఆయనకు బెయిల్ రాకుండా ఉండేందుకే రాజద్రోహం కేసు పెట్టారని ఎంపీ తరఫు లాయర్ గట్టిగా వాదనలు వినిపించారు. ఇరువురి తరఫున వాదనలు విన్న సుప్రీం తీర్పును మరి కాసేపట్లో వెల్లడించనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed