పప్పులో కాలేసిన కంగనా.. సొంత పార్టీ ఎంపీపైనే విమర్శలు..!

by Disha Web Desk 19 |
పప్పులో కాలేసిన కంగనా.. సొంత పార్టీ ఎంపీపైనే విమర్శలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా కాషాయ పార్టీ ముందుకు సాగుతోంది. ఇండియా కూటమిని మరోసారి చిత్తు చేసి.. ఎర్రకోటపై మరోసారి కాషాయ జెండా రెపరెపలాడించేందుకు పకడ్బందీగా వ్యూహాలు రచించింది. ఇందులో భాగంగా సెలబ్రెటీలు, క్రీడాకారులను సైతం బీజేపీ ఈ ఎన్నికల్లో బరిలోకి దింపింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత కంగనా రనౌత్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. కంగనా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీని రంగంలోకి దించింది.

దీంతో కంగనా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సైతం కంగనా మండి పార్లమెంట్ పరిధిలో ప్రచారం హోరెత్తించారు. అయితే, ఓ సభలో మాట్లాడిన కంగనా పప్పులో కాలేశారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై విమర్శలు ఎక్కుపెట్టబోయి.. సొంత పార్టీ నేతపైన విమర్శలు చేశారు. ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేయబోయిన కంగనా.. ఆయనకు బదులుగా బీజేపీ కర్నాటక ఎంపీ తేజస్వీ సూర్యపై ఫైర్ అయ్యారు. రౌడీజం చేసే తేజస్వీ సూర్య చేపలు తింటుంటారని కంగనా విమర్శించారు.

తేజస్వీ యాదవ్‌కు బదులు బీజేపీ నేత తేజస్వీ సూర్యపై కంగనా విమర్శలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కంగనా వీడియోపై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. కనీస రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్లకు టికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుందని.. ప్రత్యర్థి ఎవరో, సొంత పార్టీ నేత ఎవరో కూడా తెలియని వ్యక్తికి టికెట్ ఇవ్వడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కంగనా వీడియోపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం రియాక్ట్ అయ్యారు. అసలు ఈమె ఎవరూ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Next Story

Most Viewed