పోడు రైతులపై కేసులు ఎత్తివేస్తాం.. సమస్య పరిష్కరిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

by  |
పోడు రైతులపై కేసులు ఎత్తివేస్తాం.. సమస్య పరిష్కరిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: అనేక ఏళ్లుగా ఉన్న పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, గిరిజనుల ఆందోళనను సమూలంగా తొలగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం, అడవీ భూముల సంరక్షణపై.. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అఖిలపక్ష సమావేశంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. పోడు సమస్య పరిష్కారంతో పాటు గిరిజనులపై ఉన్న పోడు కేసులను కూడా ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, అందరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు కేసిఆర్ కేబినెట్ సబ్ కమిటీ వేశారని గుర్తు చేశారు. ఈ కమిటీ మూడుసార్లు సమావేశమై తన నివేదికను ప్రభుత్వానికి అందించింద‌న్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసిఆర్ కలెక్టర్లు, అటవీ, గిరిజన, రెవెన్యూ శాఖల అధికారులతో ఒక రోజంతా సమావేశమై సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశం చేశార‌ని అన్నారు.

పోడు సమస్యను తీర్చి, గిరిజనుల ఆందోళనను తగ్గించేందుకు చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధ‌న్యావాదాలు అంటూ పేర్కొన్నారు. అనంతరం అడవులను సంరక్షించడంపై అందరూ ప్రతిజ్ణ చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed