ఉపాధి కోసం వచ్చి ఊడ్చేసిన కూలీలు..!

by  |
ఉపాధి కోసం వచ్చి ఊడ్చేసిన కూలీలు..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి కోసం వచ్చిన కూలీలు పని ఇచ్చిన సంస్థకే సున్నం పెట్టారు. రోజువారీగా కూలీ పనులు చేసే వారికి ప్రాజెక్టు మేనేజర్ కార్యాలయంలోని రూ.20లక్షల నగదు కంట పడింది. ఆ డబ్బును ఎలాగైనా దొంగలించాలని ముగ్గురు కూలీలు ప్లాన్ చేశారు. అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో క్యాంప్ ఆఫీసులోకి వెల్లి ఆ నగదును అపహరించి తమ స్వగ్రామాలకు బయలుదేరారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పథకం ప్రకారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంతర్గాం, గోలివాడ పంప్ హౌజ్ క్యాంప్ ఆఫీసులో జులై 6వ తేదీ అర్ధరాత్రి చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. నిత్యం వాహనాల రాకపోకలు, జనాల సందడితో ఉండే క్యాంపులో చోరీ కావడం ఓ ఎత్తైతే, వందల సంఖ్యలో పనిచేస్తున్న చోట దొంగలను పట్టుకోవడం చాలా కష్టతరంగా మారింది.అయినా, సాంకేతికతను ఉపయోగించి దొంగలను పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. యూపీలోని నేపాల్ సరిహధ్దు గ్రామానికి చెందిన ముగ్గురు ఉపాధి కోసం గోలివాడ పంప్ హౌజ్ వద్దకు వచ్చి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో స్పెషల్ టీంగా ఏర్పడి, నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ. లక్ష రికవరీ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు. రామగుండం సీఐ తాండ్ర కరుణాకర్ రావు నేతృత్వంలోని బృందం సరిహద్దు గ్రామాలకు వెళ్లి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్లు చెప్పారు. ఆ కూలీలు యూపీలోని శ్రావస్తి జిల్లా మాఫీ గ్రామానికి చెందిన రాజు కతిరా, వీరేందర్ కుమార్ లుగా గుర్తించగా, మరో నిందితుడు ధర్మేందర్ కతిరా పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు డీసీపీ రవీందర్ చెప్పారు.



Next Story

Most Viewed