సంస్థాగత ఎన్నికల్లో టీఆర్ఎస్.. కీలక నేతలకు కాంగ్రెస్ గాలం

by  |
సంస్థాగత ఎన్నికల్లో టీఆర్ఎస్.. కీలక నేతలకు కాంగ్రెస్ గాలం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్‎గా మారుతున్నాయి. అధికార పార్టీ నేతలు సంస్థాగత ఎన్నికల్లో బిజీ బిజీగా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీల ముఖ్య నేతలపై దృష్టి సారించింది. వారికి చేయి అందించేందుకు సన్నద్ధమవుతోంది.

త్వరలోనే ముహూర్తం..

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడిని కలిసిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.. ఈ నెలాఖరు, వచ్చే నెల మొదటి వారంలో అయినా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయంపై త్వరలోనే టీపీసీసీ కూడా తేదీ ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేసి.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన ఈ నెలాఖరులోపు హైదరాబాద్‌లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇటీవల పీసీసీ అధ్యక్షుడితో మంతనాలు చేసినట్టు సమాచారం. ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిగత, రాజకీయ సమస్యల కారణంగా ఆ నేతలు అధికార పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

మన్నె జీవన్ రెడ్డి గురించి చర్చ..

ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన మన్నె జీవన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యునిగా అవకాశం లభించడం అధికార పార్టీలో చర్చలకు దారి తీస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలు, తమ కంపెనీలలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మన్నె కుటుంబానికి చెందిన జీవన్ రెడ్డి.. గతంలో రాజకీయ ప్రవేశం చేసినంత పని చేశారు. తన సొంత నియోజకవర్గమైన జడ్చర్లలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించగా.. అధిష్టానం సూచనలతో ఆయన కొంత వెనుకడుగు వేశారు. ఆ సమయంలోనే తప్పనిసరిగా జీవన్ రెడ్డి రాజకీయ ప్రవేశం చేయడం ఖాయం అన్న ప్రచారం జరిగింది.

ఇటీవల ఆ ప్రచారం సద్దుమణిగినప్పటికీ.. ప్రస్తుతం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఆయనకు టీటీడీ పాలక మండలి సభ్యునిగా అవకాశం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మన్నె కుటుంబానికి ఉన్న అనుబంధం కారణంగానే జీవన్ రెడ్డికి ఈ అవకాశం లభించినట్టు ఆ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీకి సన్నద్ధమైనా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రచారం జరుగుతోంది.

ఎటూ తేల్చుకోని మాజీలు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యేలు దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి ముఖ్యమైన నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి అడుగువేస్తున్నట్టు సమాచారం. వారు కాంగ్రెస్‌లో చేరవచ్చునని ప్రచారాలు జరిగినా.. ఇప్పటివరకు నిర్ణయాలు తీసుకోలేదని అనుచరులు చెబుతున్నారు. త్వరలోనే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా టీడీపీని వీడి ఏ పార్టీలో చేరాలనే విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంపై రానున్న రెండు మూడు నెలల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారనున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed