మెంటల్ ఇల్‌నెస్ ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్

by Disha Web Desk 7 |
మెంటల్ ఇల్‌నెస్ ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్
X

దిశ, ఫీచర్స్: మానసిక అనారోగ్యంతో(mental illness) బాధపడుతున్న స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండురెట్లు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌లో ఇటీవల పబ్లిషైన వివరాల ప్రకారం.. మానసిక అనారోగ్యం, న్యూరోసైకియాట్రిక్ వైకల్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి వ్యసనాలు కలిగిన మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గమనించారు. అధ్యయనంలో భాగంగా స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌‌‌కు (Karolinska Institute) చెందిన పరిశోధకులు1940 నుంచి 1995 మధ్య జన్మించిన నాలుగు మిలియన్ల మంది మహిళలను సంప్రదించి వివరాలు రాబట్టారు.

మానసిక అనారోగ్యం(mental illness), న్యూరో సైకియాట్రిక్ వైకల్యం (neuropsychiatric disability) లేదా మాదకద్రవ్యాల వినియోగం అలవాట్లు కలిగిన వారిని, అలాంటి అలవాట్లు లేనివారితో పోల్చిచూశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా పరిశీలించారు. మెంటల్ ఇల్‌నెస్ కలిగిన మహిళలు గర్భాశయ సమస్యలున్నప్పటికీ రోగ నిర్ధారణ స్ర్కీనింగ్ ప్రోగ్రాములకు దూరంగా ఉండటం, త్వరగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మూలంగా ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్ స్టడీస్ నిపుణుడు కేజియా హు చెప్పాడు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలు క్రమం తప్పకుండా గైనకాలజీ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

డబ్ల్యుహెచ్‌ఓ సూచన

2020, మే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదాన్ని ముందస్తుగా నివారించే వ్యూహాన్ని రూపొందించింది. ప్రపంచానికి సూచనలు అందించింది. 70 శాతం మంది మహిళలు కనీసం 35 ఏళ్లలోపు ఒకసారి, 45 ఏళ్లలోపు రెండుసార్లు గర్భాశయ క్యాన్సర్ నిర్ధారిత టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. ప్రస్తుతం అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు కూడా అదే సూచిస్తున్నారు.


Next Story

Most Viewed