టీఆర్ఎస్ మంత్రుల పద్మవ్యూహంలో ఈటల దంపతులు సక్సెస్..!

by  |
టీఆర్ఎస్ మంత్రుల పద్మవ్యూహంలో ఈటల దంపతులు సక్సెస్..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వినూత్నంగా ప్రచారం సాగుతోంది. రెండు పార్టీల మధ్యే నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతున్న ప్రచార హోరులో ప్రధాన పార్టీలు వైవిధ్యంగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ ప్రచార పర్వంపై ఓ లుక్కెద్దాం.

టీఆర్ఎస్ తీరిది..

ఈటల ఎపిసోడ్ తరువాత నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ ప్రచారం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు హుజూరాబాద్ కేంద్రంగానే సమీకరణలు జరుపుతున్నారు. వీరితో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు కూడా హుజూరాబాద్‌లోనే పర్యటించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి మంత్రులు తన్నీరు, గంగుల, కొప్పుల అన్నీ తామై పని చేస్తున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా సామాజిక వర్గాల వారీగా సమీకరణాలు జరుపుతూనే ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రచార సభలు, ఓటు బ్యాంకు ఉన్న వారిని టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మల్చుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఓటర్లను ప్రభావితం చేసే ఏ అంశాన్ని వదలకుండా పావులు కదుపుతున్నారు. 2004 నుంచి సిట్టింగ్ అయిన ఈటల కోటకు బీటలు వాల్చడమే లక్ష్యంగా ఈ మంత్రులు ముందుకు సాగుతున్నారు. ఈటల రాజేందర్‌ను ఒంటరిని చేయడమే లక్ష్యంగా సెకండ్ కేడర్‌ను ఆయనకు దూరం చేయడంలో సఫలం అయ్యారు. ఈటల రాజీనామా చేసిన తరువాత ఆయన వెంట నడిచిన ప్రతి ఒక్కరిని కూడా తిరిగి రప్పించుకుని గ్రామస్థాయిలో సమీకరణాలు చేస్తున్నారు.

ఈటల స్టైల్ ఇది..

రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదురించి ఉప ఎన్నికల బరిలో నిల్చిన ఈటల రాజేందర్ నియోజకవర్గంలో అన్నీ తానై పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఓ వైపున ఈటల, మరో వైపున ఆయన సతీమణి జమునమ్మలు ప్రచారంలో తిరుగుతూనే ఉన్నారు. గ్రామాల్లో తిరుగుతూ తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత అయితే ఈటల దంపతులు కార్యక్షేత్రంలోనే తిరుగుతూ తమ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అండగా నిలుస్తారనుకున్న సెకండ్ కేడర్ అంతా కూడా తనను వీడినా.. ఈటల రాజేందర్ మాత్రం వెనుకంజ వేయడం లేదు. పక్కా ప్రణాళికతో రాజేందర్ కొన్ని గ్రామాలు తిరిగితే ఆయన భార్య జమునమ్మ కొన్ని గ్రామాలు తిరుగుతూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో సక్సెస్ అయ్యారా..?

టీఆర్ఎస్ వేసిన పద్మవ్యూహంలో చిక్కుకోకుండా ఈటల తన పంథాతో ముందుకు సాగుతుండడం విశేషం. ప్రత్యర్థి పార్టీ తనను ఒంటరి చేయడంలో సఫలం అయినా ఆయన మాత్రం గుండె నిబ్బరంతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. సెకండ్ కేడర్ లీడర్లంతా కూడా తనకు దూరం అయినా.. ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఈటల రాజేందర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈటల చుట్టూ ఉన్న నాయకులందరినీ వెనక్కి రప్పించుకుంటే ఆయన మానసికంగా దెబ్బతింటారని భావించినప్పటికీ ఆయన ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. దీంతో గులాబీ నాయకులు వేసిన ఎత్తుగడలను ఆయన చిత్తు చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పకతప్పదు.


Next Story

Most Viewed