పేడ ఇవ్వండి – గ్యాస్ సిలిండర్ పొందండి

by  |
పేడ ఇవ్వండి – గ్యాస్ సిలిండర్ పొందండి
X

దిశ, ఫీచర్స్ : ఎన్నో గ్రామాల్లో ఇప్పటికీ కట్టెలపొయ్యి వాడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. బీహార్‌లోని పల్లె ప్రజలు కలప, పంట వ్యర్థాలు, పశువుల పేడను వంటచెరుకుగా ఉపయోగించి ‘చుల్హా’పై వంట చేస్తుంటారు. వాటినుండి వెలువడే పొగవల్ల అక్కడి మహిళలు తరుచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు. కానీ ఇప్పుడు అదంతా గతంగా మారిపోతోంది. నేడు ఆ పల్లె పడుచులు ‘వేస్ట్’‌ను గ్యాస్‌గా మలచడమే కాకుండా, ‘గోబర్ దీబో, గ్యాస్ లీబో’ అని నినదిస్తున్నారు. అర్థం కాలేదు కదా.. ‘ఆవు పేడ ఇవ్వండి – గ్యాస్ సిలిండర్ పొందండి’ అంటూ తమ గ్రామ ప్రజలకు ఉచిత సిలిండర్ అందిస్తున్నారు.

బీహార్ ఆర్థికంగా వెనకబడిన ప్రాంతమని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ అక్కడ ఎక్కువమంది కట్టెలపొయ్యినే వాడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి వారిని విముక్తి చేయడానికి రాజేంద్రప్రసాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(ఆర్‌పీఏయూ) వైస్-చాన్సలర్ డాక్టర్ రమేష్ చంద్ర శ్రీవాస్తవ గోబర్ గ్యాస్ ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చాడు. ఇందుకోసం సుఖేత్ గ్రామపంచాయతీని ముందుగా ఎంపిక చేశాడు. ఇందులో భాగంగా నివాసితులు అందించే చెత్త, పశువుల పేడ నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసే సాంకేతికతను స్థానికులకు పరిచయం చేశాడు. దాంతో ‘ఆవు పేడ ఇవ్వండి – గ్యాస్ సిలిండర్ పొందండి’ అనే నినాదంతో ప్రతీ ఇంటికి వంట గ్యాస్ సిలిండర్ ఉచిత రీఫిల్ అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ రెండు నెలల తర్వాత 1,200 కిలోల వ్యర్థాలను కూడబెట్టిన గృహాలు ఉచిత LPG రీఫిల్‌ను పొందవచ్చు. ఇప్పటివరకు జాదవ్ యూనిట్ 25వేల కిలోల వర్మీ కంపోస్ట్ తయారు చేయగా, 44 LPG సిలిండర్లను పంపిణీ చేసింది.

2016లో భారత ప్రధాని ‘ఉజ్జ్వల యోజన’లో భాగంగా 80 మిలియన్ కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందించారు. కానీ రీఫిల్లింగ్ 26 – 70% వరకు వివిధ రాష్ట్రాల్లో పేలవంగా ఉంది. అయితే సుఖేత్ ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు గ్రామాల్లో ఈ సమస్యపై ఆర్‌పీఏయూ ఓ సర్వే చేయగా, చాలా ఇళ్లలో ఎల్‌పీజీ సిలిండర్లు ఉన్నా, రీఫిల్ చేయలేకపోతున్నారని తెలిసింది. ఈ పరిస్థితిని పరిష్కరించేందుకే పశువుల పేడతో గ్యాస్ ఎలా రూపొందిచొచ్చు అనే అంశంపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. అంతేకాదు దీని ద్వారా మహిళలను స్వయం ఉపాధి గల వారిగా తీర్చిదిద్దడం, పలువురికి ఎంప్లాయ్‌మెంట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రమేష్ ప్రారంభించిన యూనివర్సిటీ ప్రాంగణంలోని వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏటా రూ. 15 లక్షలు సంపాదిస్తుంది. అంతేకాదు పురాతన బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయం, దేవఘర్, ముజాఫర్‌పూర్‌లోని 3-శతాబ్దాల బాబా గరీబ్‌నాథ్ ఆలయంలో ఇలాంటి యూనిట్లను ప్రారంభించాడు. దీంతో ఎక్కువ శాతం‌ మంది మహిళలు పొగ రహిత వంటశాలకే మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు.



Next Story