అనధికారిక హోర్డింగ్‌లు.. పట్టించుకోని అధికారులు

by  |
అనధికారిక హోర్డింగ్‌లు.. పట్టించుకోని అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షాకాలం వచ్చందంటే చాలు సిటీలో జనాలు రోడ్డుపై నడవడానికి జంకుతారు. ఈదురు గాలులకు ఏ వైపు నుంచి ఏ హోర్డింగ్ వచ్చి మీద పడుతుందో చెప్పలేని పరిస్థతి. గ్రేటర్ ను హోర్డింగ్ ఫ్రీ సిటీ చేస్తామని నాయకులు హామీనిచ్చినా సాధ్యం కావడం లేదు. అనుమతిలేని వాటిని తొలగిస్తున్నామని బల్దియా అధికారులు చెప్తున్నా అది క్షేత్రస్థాయిలో కనబడడం లేదు. అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో జీహెచ్ఎంసీ రూ.వందల కోట్ల ఆదాయం నష్టపోవడంతో ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారాయి.

నగరంలో టవర్లు, హోర్డింగ్‌లు, ప్లెక్సీలతో ప్రమాదం పొంచి ఉంది. రక్షణ చర్యలు చేపట్టకుండానే ఏర్పాటు చేస్తుండడంతో చిన్న గాలి వచ్చినా కుప్పకూలిపోతున్నాయి. హోర్డింగ్‌ల ఏర్పాటు నాణ్యత, మన్నిక పరిశీలన చేయడంలోనూ బల్దియా అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో వీటిని నిషేధం విధించారు. 2016లో అనుమతిలేకుండా 330 భారీ హోర్డింగ్‌లు ఉన్నట్టు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు రెండేండ్ల పాటు కష్టపడి 300మాత్రమే తొలగించారు. ఆ తర్వాత ఇతర చొట్లలో కొత్త హోర్డింగ్లు వెలవడం గమనార్హం. వ్యాపార వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వచ్చిన నేపథ్యంలో మే 2017 నుంచి కొన్ని షరతులతో అనుమతులు ఇస్తున్నారు. అయితే సరైన పద్ధతిలో అమర్చనివి కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరో వైపు హోర్డింగ్‌ల ఏర్పాటుతో బల్దియాకు రావాల్సిన ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.

‘హోర్డింగ్‌ ఫ్రీ సిటీ’ సాధ్యమేనా..!

నగరాన్ని ‘హోర్డింగ్‌ ఫ్రీ సిటీ’గా మారుస్తామని గతంలో మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ ప్రకటించారు. అయితే ఆ దిశగా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్రేటర్‌ పరిధిలో 2,600 హోర్డింగ్‌లకు మాత్రమే అనుమతి ఉండగా.. ఐదు వేలకు తగ్గకుండా ఉన్నట్టు అంచనా. అనుమతితో ఏర్పాటు చేసిన వాటి నాణ్యత, మన్నిక ఎలా ఉందనే అంశంపై జేఎన్‌టీయూ, ఐఐటీ నిపుణులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ అంశాలను అమలు చేయడంలోనూ బల్దియా విఫలమవుతోంది. గతంలో నిషేధం విధించినపుడు హోర్డింగ్ ఏజెన్సీలకు ఏడాదికి రూ.500 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. నిబంధనలను అతిక్రమించి ఏర్పాటు చేస్తున్న సందర్భంలో కీలకమైన బల్దియా పెద్దలకు వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లు చేతులు మారుతున్న ఈ వ్యాపారంలో బల్దియా కూడా రూ.కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. దీంతో హోర్డింగ్‌లు పూర్తిగా తీసేయడం సాధ్యమయ్యే పని కాదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. అయితే బెంగళూర్‌ మాదిరిగా ‘ప్రమాద రహిత హోర్డింగ్‌’ పాలసీ విధివిధానాలు రూపొందించి, అమలు చేయాల్సిన అవసరం ఉంది.

ఆదాయం ఆవిరి..

బల్దియాలో అనుమతి ఉన్న 2,600 హోర్డింగ్‌ల నుంచి ఏడాదికి రూ.36 కోట్ల ఆదాయం వస్తోంది. అయితే నగరంలో వాస్తవంగా ఐదు వేలకు పైగా హోర్డింగ్‌లు ఉన్నాయని, ఆయా ఏజెన్సీలు నిబంధనల ప్రకారం చెల్లించినా బల్దియాకు రూ.వంద కోట్ల ఆదాయం వస్తుందని గణంకాలతో సహా అప్పటి బల్దియా కమిషనర్‌ జనార్థన్‌రెడ్డికి తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు వివరించారు. ఆ దిశగా చర్యలు చేపట్టినా తరువాత ఆయన బదిలీ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఎల్‌బీ స్టేడియం హోర్డింగ్‌ కూలి ఒకరు మరణించడంతో టవర్ల స్టెబిలిటీపై జేఎన్‌టీయూ, ఉస్మానియాకు చెందిన ఇంజినీరింగ్‌ నిపుణులతో అధ్యయనం చేయించి, తక్షణం నివేదిక సమర్పించాలని గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ ఆదేశించారు. నగరంలో అనుసరించాల్సిన విధానంపైనా నివేదికను కోరారు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించాలని ఆయా ఏజెన్సీలకు ఆదేశించారు. అవేవి అమలు కాలేదు.

పాటించాల్సిన నిబంధనలు

– భూమి మీద, గోడల మీద హోర్డింగ్‌ల సైజు 40f పొడవు, 25f వెడ్పలు.
– బిల్డింగ్‌ల టాప్‌ మీద రెండంతస్తుల కంటే ఎత్తులో ఏర్పాటు చేయొద్దు. వాటి పరిమాణం కూడా 30ఎఫ్, 25ఎఫ్ ఉండాలి.
– సింగిల్‌ ఫ్లెక్సీ/వినైల్‌ మాత్రమే ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు జరగవని సదరు ఏజెన్సీ అండర్‌టేకింగ్‌ ఇవ్వాలి. ఒకవేలా ప్రమాదం జరిగినా కింద పడకుండా వైర్లు ఏర్పాటు చేయాలి.
– శిథిల, పురాతన భవనాలపై ఏర్పాటు చేయొద్దు. గాలికి, వర్షానికి పడితే ఏజెన్సీలే తొలగించాలి.
– జేఎన్‌టీయూ, ఐఐటీ నిపుణులతో నిర్మాణ నాణ్యతను పరిక్షించాలి.

నిద్రావస్థలో అడ్వర్టయిజింగ్‌ విభాగం..

మెట్రో ప్రారంభించిన తొలి నాళ్లలో హోర్డింగ్‌లు పడిపోయి రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. దీంతోపాటు ప్రత్యేక పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టంలో కూడా సమస్యల వచ్చాయి. మెట్రో ఉన్నతాధికారులు పరిశీలించి హోర్డింగ్ లను తొలగించాలని జీహెచ్‌ఎంసీకి 2018 మే 30న లేఖ రాశారు. మెట్రో అధికారులు సర్వే చేసి నాగోల్‌-మియాపూర్‌, ఎల్‌బీనగర్‌- మియాపూర్‌ మధ్య 147 హోర్డింగ్‌లు ఉన్నట్టు బల్దియాకు నివేదించారు. అయినా ఒక్కటి కూడా తీయలేదు. అడ్వర్టయిజ్‌మెంట్‌ ఐడెంటిఫికేష్‌ నెంబర్‌(ఏఐఎన్‌) లేకుండానే హోర్డింగ్‌లు పెడుతున్నా ఒక్క సంస్థ మీద బల్దియా అడ్వర్టయిజ్‌మెంట్‌ విభాగం జరిమానా విధించలేదు.

ఏజెన్సీలదే పైచేయి

హోర్డింగ్‌ల ఏర్పాటులో నిబంధనల అమలు చేయడంతో పాటు పాటించని వారిపై చర్యలు తీసుకునే అధికారం బల్దియా అడ్వర్టయిజింగ్‌ విభాగానికి ఉంది. బల్దియాలో ఓ అడిషనల్‌ కమిషనర్‌తోపాటు ప్రతి జోన్‌కు ఒక ఇన్ స్పెక్టర్‌, అసిస్టెంట్ ఇంజినీర్‌ను ఏర్పాటు చేశారు. నిషేధం విధించినప్పుడు అడ్వర్టయిజ్‌మెంట్‌ సంస్థలు కోర్టుకు వెళ్లినా బల్దియాకే అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. మెట్రో పరిధిలో లిబ్రా, కళ్యాణ్‌, రెయిన్‌బో, రిలయన్స్‌ ఔట్‌డోర్‌, ప్రకాశ్‌, దివ్య, నీరూస్‌, శ్వేత, సోనోవిజన్‌, యూనియాడ్స్‌ సహా అన్ని హోర్డింగ్‌లు ఏర్పాటు చేశాయని, వాటిని తొలగించాలని లొకేషన్లతో సహా హెచ్‌ఎంఆర్‌ వివరాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. గతంలో ఓ ఐఏఎస్‌ అధికారి హోర్డింగ్ సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవడంతో ఏజెన్సీ సంస్థలు పావులు కదిపి బదిలీ చేయించాయి. ఆ తర్వాత హోర్డింగ్‌లపై దృష్టి సారించేవారు కనిపించడం లేదు. బల్దియాలోని పెద్ద తలకాయలకు ముడుపులు అందడంతోనే ఈ విభాగం నిస్తేజంగా మారిందనే ఆరోపనలు వినిపిస్తున్నాయి.

నగరంలో జరిగిన కొన్ని ప్రమాదాలు…

– తార్నాక, బాలానగర్‌, కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ల పరిధిలో 2019 ఏప్రిల్‌ 5, 8 తేదీల్లో ఫ్లెక్సీలు పడిపోయి 25కేవీ ఓహెచ్‌ఈ లైన్లలో సమస్యలు ఏర్పడి మెట్రో రాకపోకలు నిలిచిపోయాయి.
– 2019 ఏప్రిల్లో ఎల్బీ స్టేడియంలో ఉన్న ఫ్లడ్‌లైట్‌ టవర్‌ కూలి ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
– జూబ్లీహిల్స్‌లోని మారుతీ షోరూం వద్ద హోర్డింగ్‌ కూలి మూడుకార్లు ధ్వంసమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
– జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌కు వెళ్లేదారిలో గాలి దుమారానికి భారీ హోర్డింగ్‌ పడింది. ఆ సమయంలో వాకర్స్‌ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.



Next Story

Most Viewed