కోట్లు కొల్లగొట్టడమే పరమావధి

by Disha edit |
కోట్లు కొల్లగొట్టడమే పరమావధి
X

వర్తమాన సినిమాకు సంబంధించిన ఒక కొత్త ఒరవడిని మనం గమనించవచ్చు. తెలుగులో ఒక సినిమా నిర్మాణానికి పూనుకుంటే మొదట స్టార్లు స్టార్ డైరెక్టర్లు కావాలి. కోట్ల పెట్టుబడి కావాలి. ఆ విషయాలని షూటింగ్ మొదటి రోజుల్నించే విస్తృత ప్రచారంలోకి తేవాలి. నిర్మాణానికి రెండు మూడేళ్ళు తీసుకోవాలి. ఇక అప్పటి నుండి అన్ని రోజులూ ప్రచారమే. షూటింగ్ కాలంలో ప్రతి చిన్నా పెద్దా సంఘటన ఒక ఈవెంటే. దాంతో జనాల్లో ఎంత గొప్ప సినిమా తయారవుతున్నదో అన్న భ్రమ ఏర్పడిపోతుంది. స్టార్ల అభిమానులూ, వాళ్ల సందడీ ఈ రెండు మూడేళ్లు ఎట్లాగూ వుంటుంది. ఫస్ట్ లుక్ అవుట్ అనీ, సెకండ్ లుక్ అనీ రకరకాలుగా ప్రచార వ్యూహాలు ఉండనే వున్నాయి.

'కోట్లు పెట్టు, కొల్లగొట్టు, తగ్గేదే లే' ఇదీ ఇవ్వాల్టి సినిమా నినాదం. ఒక రకంగా తెలుగు సినిమాకు అది బజ్ వర్డ్. సినిమా సర్వకళా మిశ్రమం. 24 కళల సంగమం. కళాత్మక సినిమా. ప్రజల సినిమా లాంటి మాటలకు నేడు అర్థం లేకుండా పోయింది. అవన్నీ అంతరించిపోయిన మాటలు. మరో రకంగా చెప్పాలంటే అర్థం లేని 'పురావస్తు' మాటలు. ఇప్పుడు సినిమా వ్యాపారాత్మక కళ కూడా కాదు, అది కేవలం ఒక 'పరిశ్రమ' ఒక వ్యాపారం. పెట్టుబడి, లాభాలు, ప్రచారం, ప్రాభవం వున్న రంగం.

అంతేకాదు, ఇవ్వాల్టి సినిమాకు కేవలం మార్కెట్ ఒక్కటే భూమిక. ఈ రోజుల్లో కథేమిటి? సబ్జేక్టేమిటి? తీసే సరళి ఏమిటి? అన్న విషయాల కంటే ఎంత పెట్టుబడి ఎంత మంది స్టార్లు అన్నదే ప్రధానమయిన అంశంగా మారిపోయింది. అంతేకాదు ఎన్ని వందల వేల సినిమా హాళ్లల్లో విడుదల అన్నదీ లక్ష్యమే. హిందీతో సహా దాదాపు అన్ని భారతీయ భాషా సినిమాల స్థితీ ఇదే. అయితే, ఆ దిశలో మన తెలుగు సినిమా 'పాన్ ఇండియా' ప్రాభవాన్ని కలిగి వుంది. అంటే అన్ని భాషలకూ ఈ విషయంలో దాదాపు మార్గదర్శకంగా వుంది.

ప్రచారంతో మొదలు

వర్తమాన సినిమాకు సంబంధించిన ఒక కొత్త ఒరవడిని మనం గమనించవచ్చు. తెలుగులో ఒక సినిమా నిర్మాణానికి పూనుకుంటే మొదట స్టార్లు స్టార్ డైరెక్టర్లు కావాలి. కోట్ల పెట్టుబడి కావాలి. ఆ విషయాలని షూటింగ్ మొదటి రోజుల్నించే విస్తృత ప్రచారంలోకి తేవాలి. నిర్మాణానికి రెండు మూడేళ్ళు తీసుకోవాలి. ఇక అప్పటి నుండి అన్ని రోజులూ ప్రచారమే. షూటింగ్ కాలంలో ప్రతి చిన్నా పెద్దా సంఘటన ఒక ఈవెంటే. దాంతో జనాల్లో ఎంత గొప్ప సినిమా తయారవుతున్నదో అన్న భ్రమ ఏర్పడిపోతుంది. స్టార్ల అభిమానులూ, వాళ్ల సందడీ ఈ రెండు మూడేళ్లు ఎట్లాగూ వుంటుంది. ఫస్ట్ లుక్ అవుట్ అనీ, సెకండ్ లుక్ అనీ రకరకాలుగా ప్రచార వ్యూహాలు ఉండనే వున్నాయి.

దేశ విదేశాల్లో చెమటలు కక్కి నిర్మాణం పూర్తి అయ్యాక విడుదల మరో గొప్ప ఈవెంట్ అవుతుంది. రిలీజ్ బహుశా ఇప్పుడూ అప్పుడూ అంటూ ఊదరగొట్టేస్తారు. ఇంక ఏముంది ప్రజల్లో ఒక ఉత్కంఠ పెరిగిపోతుంది. తాము ఆ ఈవెంట్‌లో పాల్గొనకపోతే ఎట్లా అన్న 'మాస్ హిస్టీరియా' స్థితి ఏర్పడుతుంది. వందలాది థియేటర్లలలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతాయి. అడ్వాన్స్ బుకింగులూ అవీ ఉండనే వున్నాయి. మొదటి మూడు రోజులూ జనం కిక్కిరిసి పోతారు (తర్వాతి రోజులు ఆ సినిమా భవిష్యత్తును తేలుస్తుంది, అది వేరే సంగతి). ఇటీవలి కాలంలో మరో ఒరవడి మొదలయింది. ప్రతి కోట్లాది రూపాయల సినిమానీ అనేక భాషల్లోకి డబ్ (అనువాదం) చేసి దేశ విదేశాల్లో ఒకేసారి విడుదల చేయడం. దాన్నే 'పాన్ ఇండియన్ సినిమా' అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఆ రిలీజ్ ఈవెంట్లో భాగస్వాములు అవుతారు.

లాభాలు ధ్యేయంగా

ఇటీవల ఈ రకంగా విడుదల అయిన తెలుగు సినిమాలు రెండు భిన్నమయిన అనుభవాల్ని ఎదుర్కొన్నాయి. అల్లు అర్జున్ 'పుష్ప'ది మొదటి అనుభవం. పుష్ప కొంత భిన్నంగా వుండడం మార్కెటింగ్ చాలా ప్లాన్‌గా చేయడంతో విజయవంతమయిన సినిమాగా నిలిచి నిర్మాతలకు ఆర్థికంగా గొప్ప లాభాల్ని అందించిందని టాక్. తర్వాత విడుదల అయిన పవన్ కళ్యాణ్ సినిమా 'భీమ్లా నాయక్' టికెట్ రేట్ల వివాదాన్నీ, రాజకీయ వొత్తిడినీ ఎదుర్కొంది. జనం ఆ సినిమా అంటే పడి చచ్చారని పవన్ కళ్యాణ్ వెంటే వున్నారని ప్రచారమూ అదరగొట్టారు. సినిమా రెండవ వారం తర్వాత స్లో అయిందని, ఆశించిన స్థాయిలో ఆర్థికంగా నిలబడలేదని కథనాలు వెలువడ్డాయి.

లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక. ఇక బాహుబలి తర్వాత ఎంతో ప్రచార ఆడంబరంతో వెలువడ్డ సినిమా 'రాధేశ్యామ్' సినిమాకు ఖర్చు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని ప్రచారం చేసినా ఆ సినిమా కుప్పకూలిపోవడం తెలుగు సినిమా రంగానికి విషాదమే. బాహుబలితో దేశవ్యాప్త పేరు ప్రచారం పొందిన ప్రభాస్‌కు కూడా ఇది ఊహించని దెబ్బే అనిపిస్తున్నది. ఇక ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో తేలాల్సింది 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా భవిష్యత్తు. దాని ఫలితం తెలుగు సినిమా రంగ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మార్కెటింగ్ తో తెలుగు సినిమా రంగం ఏ మేరకు నిలబడుతుందా చూడాలి.

నందులు లేవు, ఫెస్టివల్స్ లేవు

ఇంతగా పెట్టుబడీ ప్రచారమూ అన్న ఉప్పెనలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగం గుర్తింపుని గౌరవాన్ని గురించిన సోయిని కోల్పోయిందనే చెప్పుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలూ సినిమా రంగం పైన దృష్టి పెట్టలేదనే చెప్పాలి. రెండు రాష్ట్రాలు థియేటర్లలో టికెట్ రేట్లు తగ్గించడమా? పెంచడమా? అయిదవ 'షో'కు అనుమతి ఇవ్వడమా లేదా బెనిఫిట్ షోల సంగతేమిటి? అన్న విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టాయి. ఆంధ్ర ప్రభుత్వం రేట్లు తగ్గిస్తే, తెలంగాణా ప్రభుత్వం సినిమా వాళ్లకు అనుకూలంగా చర్యలు తీసుకుంది. కానీ, రెండు రాష్ట్రాలలో కూడా సినిమాలకు ఏటా ఇచ్చే అవార్డులు, నిర్వహించే ఫిలిం ఫెస్టివల్స్ గురించిన ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వాలు ఫిలిం డెవలప్మెంట్ గురించి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నది నిజం. సినిమా వాళ్లు వాటి పట్టింపే లేదు. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలూ, వ్యక్తులూ, ప్రభుత్వాలూ అనేక అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. ఆస్కార్ అవార్డులు అందుకు ఉదాహరణ.

ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించడం వలన ప్రపంచవ్యాప్త సినిమాను వీక్షించే అవకాశం కలుగుతుంది. మనమెట్లా అభివృద్ధి చెందాలో తెలుస్తుంది. నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ఎన్ని వివాదాలున్నా కేంద్రం ఏటా క్రమం తప్పకుండా మంచి సినిమాలకు అవార్డులు ఇవ్వడం, ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించడం చేస్తున్నది. ఆ సోయి తెలుగు ప్రభుత్వాలకు లేకపోవడం ఆశ్చర్యం. 2014 దాకా క్రమం తప్పకుండా ఇస్తూ వచ్చిన 'నంది' అవార్డులు మూలన పడ్డాయి. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్ని 2003 నుంచీ హైదరాబాద్‌లో శాశ్వత కేంద్రంగా నిర్వహించేవారు. అందుకు అప్పుడు కేంద్ర మంత్రిగా వున్న జైపాల్ రెడ్డి కృషిని గుర్తు చేసుకోవాలి. కానీ, 2017 తర్వాత దాని ఊసే లేకుండా పోయింది.


వారాల ఆనంద్

94405 01281

Next Story

Most Viewed