ప్రాణాలు కబళిస్తున్న రోడ్లు

by Disha edit |
ప్రాణాలు కబళిస్తున్న రోడ్లు
X

ఇటీవలే జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2022 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, మనదేశంలోని జాతీయ, రాష్ట్ర, ఇతర రహదారులన్నీ కలిపి 63.31లక్షల కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్డు వ్యవస్థ కలిగి ఉన్నది. ఇందులో జాతీయ రహదారులు 1.32 లక్షల కి.మీ ( 2.1%), రాష్ట్ర రహదారులు 1.80 లక్షల కి.మీ ( 2.8 % ), ఇతర రహదారులు 60.59 లక్షల కి.మీ (95.1%) పొడవు కలిగి ఉన్నాయి. మొత్తం రవాణా వ్యవస్థలో సరుకు రవాణాలో 71 శాతం, ప్రయాణీకుల రవాణాలో 85 శాతం రోడ్డు మార్గం ద్వారానే జరుగుతున్నాయి.

దేశంలో ఎక్కువ ప్రమాదాలు..

ఈ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 4,61,312 రోడ్డు ప్రమాదాలలో గాయాలపాలవ్వగా, 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే 2021 సంవత్సరంలో మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలలో 1,53,972 మంది మృత్యువాత పడగా 3,84,448 మంది క్షతగాత్రులయ్యారు. 2021 కంటే 2022 లో పెరిగిన శాతం వరసగా 11.9 శాతం, 9.4 శాతం, 15.3 శాతంగా ఉంది. సగటున ప్రతీ గంటకు 53 ప్రమాదాలలో 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం ప్రమాదాలలో 33.80 శాతం మంది అక్కడికక్కడే ప్రాణాలు వదులుతున్నారు. ఇందులో గుర్తు తెలియని వాహనాల వల్లనే అత్యధికంగా 30,486 (18.10%) మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక లక్ష జనాభాకు జరుగుతున్న ప్రమాదాల సంఖ్య 2021 సంవత్సరంలో 30.3% ఉండగా, 2022 సంవత్సరం వచ్చేసరికి ఇది 33.5 శాతానికి పెరిగింది. అదే రోడ్డు ప్రమాద తీవ్రత 2021 సం.లో 37.3 శాతంగా ఉంటే 2022లో 36.5 కి తగ్గింది. దేశసగటు కంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద ఉన్న పదివేల వాహనాలకు గాను 1970లో 103.5 మంది, 1980లో 53.10 మంది, 1990లో 28.20 మంది, 2000లో 16.2 మంది, 2010లో 10.50 మంది చనిపోగా 2020 సంవత్సరం వచ్చేసరికి 4.2 మంది మాత్రమే చనిపోయారు. చూడడానికి ఇవి తగ్గుతున్నట్టు అనిపిస్తున్నా రానురాను వాహనాల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రమాదాలు, మరణాలు ఎక్కువవుతున్నాయి. దేశంలో 2022 లో జరిగిన ప్రమాదాలలో తమిళనాడు 18,972 (12.5%) మొదటి స్థానంలో ఉండగా, కేరళ 17,627 (11.6 %), ఉత్తరప్రదేశ్ 14,990 ( 9.9 %), మధ్యప్రదేశ్ 13,860 (9.1 %), కర్ణాటక 13384 (8.8 %) తరువాత నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 8650 ( 5.7 % ), తెలంగాణా 7505 ( 4.9 % )తో వరుసగా 7 మరియు 8 స్థానాల్లో ఉన్నాయి.

ఎన్నో కారణాలు..

ప్రమాదాలకు కారణాలలో మొదటిది అతి వేగం. దీనివల్ల 2022 సంవత్సరంలో 72.3 శాతం ప్రమాదాలు జరిగాయి. 71.2 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. 72.8 శాతం మంది గాయాల పాలయ్యారు. ఆ తర్వాత మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్‌లో వెళ్ళడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, మొబైల్ ఫోన్లతో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో పాటుగా గతుకులతో కూడిన రహదారులు కూడా మరో ప్రధానమైన కారణం. ఇంకా పాదచారుల నిర్ల‌క్ష్యం, వాహనాలలో ప‌రిమితికి మించి ప్ర‌యాణికుల‌ను ఎక్కించ‌డం, రోడ్డు నిర్మాణంలో లోపాలు, నిద్ర లేకుండా సుదీర్ఘంగా వాహ‌నాల‌ను న‌డపడం, కాలం చెల్లిన భద్రతా ప్రమాణాలు లేని వాహనాలలో ప్రయాణం చేయడం, అర్ధరాత్రి తర్వాత కూడా వాహనాలు నడపడం, ట్రాఫిక్ చిహ్నాలపై అవగాహన లేకపోవడం, వయస్సు మళ్ళిన వారు డ్రైవింగ్ చేయడం, నో పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలపడంతో పాటుగా స్పీడ్ బ్రేకర్స్ మీద తెలుపు చారలు గుర్తించక పోవడం, మలుపుల దగ్గర సైన్ బోర్డులు ఏర్పాటు చేయక పోవడం వంటివి కూడా ఇతర కారణాలు. ఈ ప్రమాదాలలో కుటుంబ యజమాని మృత్యువాత పడితే ఆ కుటుంబాలు వీధిన పడతాయి. నైపుణ్యం కల వారు చనిపోతే, సేవలు లభించక దేశ జీడీపీపై ప్రభావం పడుతుంది. సరుకులతో వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురైతే యాజమానులు ఆర్థికంగా నష్టపోతారు. వాహనాలు పనికిరాకుండా పోతాయి. బీమా సంస్థలకు కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది.

కొన్ని పరిష్కారాలు

అతి వేగంగా వాహనాలు నడపరాదు. బ్లూటూత్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేయరాదు. రాత్రిపూట రోడ్డుపై వాహనాలు నిలుపరాదు. తెల్లవారు జామున వాహనాలు డ్రైవింగ్ చేయకూడదు. జన సమూహం ఎక్కువగా ఉన్న చోట, పాఠశాలల వద్ద నిదానంగా వెళ్ళాలి. ఒకే విడతలో ఎక్కువ గంటలు ట్రక్కులు నడుపరాదు. రాత్రిళ్ళు చీకటిలో సైకిళ్లపై ప్రయాణం చేయకూడదు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు, కార్లలో ప్రయాణం చేయువారు సీటు బెల్టులు ధరించాలి. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదు.

అతి వేగానికి అడ్డుకట్ట వేయడానికి రహదారుల వెంబడి ఎక్కువ సంఖ్యలో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలి. స్పీడ్ బ్రేకర్స్ మీద తెలుపు రంగు తో పాటు రేడియం ఎరుపు రంగు చారలు ఉండేటట్లు చూడాలి. మలుపుల దగ్గర, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న దగ్గర సైన్ బోర్డులు పెట్టాలి. అవసరం లేని వారికి స్పోర్ట్స్ బైక్స్ నిషేధించాలి. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై జరిమానాతో పాటుగా 5 సంవత్సరాల వరకు కొత్తగా లైసెన్సులు జారీ చేయకూడదు. మైనర్లు పట్టుబడితే వారిపైనే కాకుండా ఆ బండి యాజమానుల పైనా జరిమానాతో పాటుగా వారి లైసెన్సులు కూడా రద్దు చేయాలి. కళాశాలలను సందర్శించి స్పోర్ట్స్ బైక్స్ కనిపిస్తే కళాశాల యాజమాన్యాల వారిపైనా కూడా చర్యలు తీసుకోవాలి. లైసెన్స్ విధానం కఠినతరం చేయాలి. ఇవి కేవలం అధికారులు, ప్రభుత్వాలు చేయలేవు. ప్రజలు కూడా సహకరించాలి.

జనక మోహన రావు దుంగ

82470 45230


Next Story

Most Viewed