పాఠకులను చేరిన ఫౌండేషన్

by Disha edit |
పాఠకులను చేరిన ఫౌండేషన్
X

దేశ గ్రంథాలయోద్యమ చరిత్రలో 1972వ సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 25 సంవత్సరాలు అయిన సందర్భం. అలాగే సామాజిక, సంఘ సంస్కర్త, వితంతు వివాహం కోసం, విద్య కోసం నిరంతరం తపించిన మహోన్నత వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ 200వ జయంతి కూడా. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దీనిని 'అంతర్జాతీయ పుస్తక నామ సంవత్సరం'గా పిలుచుకున్నారు. 'పుస్తకాలు అందరికీ' అనే నినాదంతో పఠన కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లారు.

గ్రంథాలయ సేవలను విస్తృతపరిచేందుకు ఇదే ఏడాది కలకత్తాలో భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి వాటికి ఆర్థిక, సాంకేతిక సహాయాలు అందించడం, స్వచ్ఛంద గ్రంథాలయాలు నిర్వహించేవారికి సహాయం చేయడం, గ్రంథాలయ శాస్త్రంలో పరిశోధనకు సహకరించడం దీని ప్రధాన ఉద్దేశాలు. దీనికి గౌహతి, కలకత్తా, న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలలో కార్యాలయాలున్నాయి. ఈ ఫౌండేషన్‌కు గ్రంథాలయ శాస్త్రంలో అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, పరిపాలన అధికారులతో 22 మంది సభ్యులను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.

అనేక లక్ష్యాలతో

ఫౌండేషన్ సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్న పౌర గ్రంథాలయాలకు సరైన మౌలిక వసతులు, సరైన పుస్తకాలు అందించడం, నూతన భవనాలు నిర్మించేందుకు, ఉన్నవాటిని ఆధునికరించేందుకు,చేతిరాత ప్రతులను, అరుదైన పుస్తకాలను, పాత జర్నల్స్, చరిత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేసేందుకు కృషి చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో యాభై శాతం నిధులు కేటాయిస్తారు. కేంద్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం 60 శాతం, ఈశాన్య రాష్ట్రాలకు 90 శాతం నిధులు కేటాయిస్తున్నది.

గ్రంథ పాలకుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమాలు, రిఫ్రెషర్ కోర్సులు, అవగాహన సదస్సుల ఏర్పాటుకు తగిన ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తున్నది. పౌర గ్రంథాలయాలలో చిన్న పిల్లల విభాగం ఏర్పాటు చేసినందుకు సహాయం చేస్తారు. పుస్తకాల కొనుగోలుకు, ఉత్సవాలు చేసేందుకు సహాయం చేస్తారు. డిజిటల్ లైబ్రరీ ఇనిషియేటివ్ ద్వారా అరుదైన పుస్తకాలు, పెయింటింగ్స్ డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తారు.

చదువరుల వద్దకు చేరేందుకు

దేశంలో ఇప్పటివరకు 19 రాష్ట్రాలలో మాత్రమే గ్రంథాలయ చట్టాలు ఉన్నాయి. మిగతా తొమ్మిది రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ చట్టాలు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. గ్రంథాలయ వ్యవస్థను పట్టిష్ట పరచవలసిన అవసరం ఉంది. గ్రంథాలయ శాస్త్ర నిపుణులకు, గ్రంథపాలకులకు ఉపకార వేతనాలు, ఫెలోషిప్, పరిశోధన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దేశంలో అత్యధికంగా నిధులు పొందిన రాష్ట్రంగా గుజరాత్ మొదటి స్థానంలో ఉన్నది.

తెలంగాణ రాష్ట్రానికి 2020-21 అకామిడేషన్ కొరకు 25 లక్షల రూపాయలు, చిన్న పిల్లల గ్రంథాలయానికి 12 లక్షల 50 వేల రూపాయలు, స్టోరేజ్ మెటీరియల్ కొనడానికి 11 లక్షల 55 వేల రూపాయలు కేటాయించారు. ఈ సంవత్సరం 20 లక్షల రూపాయలు కేటాయించారు. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ చాలా రాష్ట్రాలు వీటిని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు. 'చదువరులకు చేరేందుకు' అనే నినాదంతో పనిచేసే ఈ ఫౌండేషన్ గురించి అన్ని రాష్ట్రాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసి వాటి సేవలను విస్తృత పరచాలి. '

పుస్తకం వర్ధిల్లాలి-గ్రంథాలయాలు వెలుగొందాలి'

రవికుమార్ చేగొని

ప్రధాన కార్యదర్శి

తెలంగాణ గ్రంథాలయ సంఘం, హైదరాబాద్

98669 28327

Next Story

Most Viewed