బీసీలను మూడు భాగాలుగా విభజించాలి!

by Disha edit |
బీసీలను మూడు భాగాలుగా విభజించాలి!
X

భారతదేశానికి సాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా సాతంత్య్ర ఫలాలు మాత్రం కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గొప్పలు చెప్పుకుంటున్న దేశంలో ప్రభుత్వ అధికారంలో దీర్ఘకాలం కొన్ని వర్గాలే రాజ్యం చేయడం పరిపూర్ణ ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? ఈ దేశ పునః నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఉత్పత్తి కులాలు నేటికీ ప్రధాన స్రవంతిలోకి రాకపోవడం దేనికి సూచిక? ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కేవలం ధన, జన అధిక్య కులాలు మాత్రమే ప్రధాన భూమిక పోషించడంతో ధన, జన ప్రాబల్యం లేని కులాల జీవితాలు పూర్తిగా మసకబారి అస్థిత్వాన్ని కోల్పోయే దశకు చేరుకున్నాయి. సమస్త రంగాలలో వీరికి దక్కాల్సిన న్యాయమైన వాటా వీరికి దక్కడం లేదు. ఇప్పటివరకూ జరిగిన బీసీ ఉద్యమ ఫలితాలను కేవలం కొన్ని కులాలకు మాత్రమే ఏకపక్షంగా అనుభవిస్తూ ఎంబీసీ కులాలను తీవ్ర వివక్షతకు గురిచేస్తున్నాయి. ఇప్పటికీ 95% కులాలు చట్టసభలలో అడుగుపెట్టకపోవడం ఆయా కులాలు అనుభవిస్తున్న రాజకీయ అంటరానితనాన్ని బుద్ధిజీవులుగా అర్థం చేసుకోవాల్సిన చారిత్రక సందర్భం ఇది.

సమాజంలోని అన్ని వర్గాల పోరాట ఫలితంగా లభించిన స్వాతంత్య్రం ఫలాలను, చట్టసభలను కొన్ని వర్గాలే పరిమితం చేసుకుని తమ చుట్టరికాలతో చట్ట సభలను నింపడాన్ని ఎండగట్టాల్సిన అవసరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ధన, జన అధిక్యం లేని మైనార్టీ కులాలను ఐక్యం చేస్తూ చట్టసభలలో మనకు ప్రాతినిధ్యం లభించే వరకూ పోరాడి లక్ష్య సాధన వైపు పురోగమించాలి. వెనుకబడిన తరగతుల స్థితిగతులపై అధ్యయనానికి వేసిన 1953 కాకా కలేల్కర్ కమిషన్, మండల కమిషన్లు తమ నివేదికలో బీసీలను, ఎంబీసీలను ఒకే గాటి కింద కట్టలేమని పేర్కొన్నాయి. ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తమిళనాడు, పాండిచ్చేరి ప్రభుత్వాలు బి.సి.లను మూడు వర్గాలుగా ఇప్పటికే విభజించాయి. తెలంగాణలో మాత్రం డీ. ఎన్.టీలుగా గుర్తించాల్సిన సంచార జాతులను ఎంబీసీలో చేర్చి వారికి అన్యాయం చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ బీసీలను.. బీసీ, ఎంబీసీ, డీఎస్‌టీలుగా విభజించాలి.

దొమ్మాట వెంకటేష్

98480 57274

Next Story