సుప్రీంకోర్టు ప్రతిష్ట పెంచిన అంబేద్కర్ విగ్రహం

by Disha edit |
సుప్రీంకోర్టు ప్రతిష్ట పెంచిన అంబేద్కర్ విగ్రహం
X

స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగ నిర్మాతలు దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నుకోవడం జరిగింది. దీని ప్రకారం, శాసన నిర్వాహక శాఖ, కార్యనిర్వాహక, శాఖ న్యాయ శాఖ అను మూడు అంగాలు ఏర్పరచింది. శాసన నిర్మాణ శాఖ దేశానికి అవసరమైన చట్టాలను రూపొందిస్తే, కార్యనిర్వాహక శాఖ ఆ చట్టాలను అమలుపరుస్తుంది. ఇక న్యాయశాఖ శాసన కార్యనిర్వాహక శాఖలు రూపొందించే చట్టాలు, నిర్వర్తించే విధులు రాజ్యాంగబద్ధంగా ఉండేలా పర్యవేక్షిస్తుంది. ఈ శాఖ ముఖ్య ఉద్దేశ్యం రాజ్యాంగ ఉనికిని కాపాడడం! కానీ ఇటీవల న్యాయ వ్యవస్థ ఆధిక్యత, స్వతంత్రతపై రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి రాజ్యాన్ని ఏలుతున్న వారి దాడి అధికమైంది. వీరు న్యాయవ్యవస్థ స్వతంత్రతపై అనేక వ్యాఖ్యలు చేస్తూ దానిని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకు ఉదహరణలే.. న్యాయ వ్యవస్థ కంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంటే ఉన్నతమైనదని మాజీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు వ్యాఖ్యానించడం, దీనికి రాజ్యసభ చైర్మన్ గొంతు కలపడం ఆశ్చర్యకరం. అలాగే కొలీజియం వ్యవస్థలోకి రాజకీయం ప్రవేశించింది. ఇలాంటి సందర్భంలో రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న సుప్రీంకోర్టు ఆవరణలో సీజేఐ ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముచే రాజ్యాంగ నిర్మాత భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ భీమ్రావు రాంజీ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం ఆవిష్కరింప చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ ద్వారా న్యాయవ్యవస్థ తన ప్రతిష్టను తానే పెంపొందించుకుంది. అదే సమయంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను ప్రశ్నించే వారికి న్యాయవ్యవస్థ ఎవరి ఒత్తిళ్లకు లొంగదని, ఏ ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వదని, న్యాయవ్యవస్థ రాజ్యాంగ విలువలకు లోబడి పనిచేస్తుందని, న్యాయం వైపు ఉంటుందని, భారత రాజ్యాంగం ఉన్నంతవరకు ఈ దేశంలోని న్యాయవ్యవస్థను ఎవరూ శాసించలేరని సంకేతాలను పంపింది. అంతేకాదు కోర్టు ఆవరణలో న్యాయవాద వేషంలో ఉన్న విగ్రహం కోర్టుకు ఒక కొత్త శోభను తెచ్చిపెట్టింది. ఇది అనేకమంది న్యాయమూర్తులకు, న్యాయవాదులకు స్ఫూర్తినిస్తుంది. న్యాయవ్యవస్థలో సరికొత్త వెలుగులు నింపుతుంది. బాధితులకు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని కలగజేస్తుంది. అందుకే ప్రతీ హైకోర్టు ఆవరణలో కూడా అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరింప చేయాలి. ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్న ఈ సమయంలో సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు ముందు నడిచిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి వి చంద్రచూడ్ గారి కృషి అభినందనీయం...

మధుకర్ మునేశ్వర్

99630 43490


Next Story

Most Viewed