నగర పరిసరాల్లోనే సంతోషి పోస్టింగ్

by  |
నగర పరిసరాల్లోనే సంతోషి పోస్టింగ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: భారత- చైనా సరిహద్దుల్లో జరిగిన రెండు దేశాల సైనికుల ఘర్షణలో ఇటీవల మరణించిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగ నియమాక ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిపర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించి ఆమెకు సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు సూచించారు. ప్రభుత్వం తరఫున ఆమెకు నగరంలోనే నివాస స్థలాన్ని ఇవ్వాలను గతంలో సీఎం చేసిన ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌లోని రోడ్ నెం. 14లో 711 చదరపు గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. కేబీఆర్ పార్కుకు ఎదురుగా ఉన్న ఆ స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి స్వయంగా వెళ్ళి పరిశీలించారు. తొలుత షేక్‌పేట లాంటి చోట్ల మూడు స్థలాలను ప్రతిపాదించినా సంతోషి బంజారాహిల్స్ ప్రాంతంలో కావాలని కోరడంతో ఆమె కోరిక మేరకు బంజారాహిల్స్‌లోనే ఖరారైంది.

ప్రగతి భవన్‌కు వచ్చిన సంతోషి, ఆమె కుటుంబ సభ్యులు, వారితో పాటు వచ్చిన మరో 20 మందితో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపికా యుగంధర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed