కరెంట్ అఫైర్స్: 9-3-2023

by Disha Web Desk 17 |
కరెంట్ అఫైర్స్: 9-3-2023
X

త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణస్వీకారం

అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండో సారి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర రాజధాని అగర్తలాలో గవర్నర్ ఎస్ఎన్ ఆర్య ఆయనచే ప్రమాణస్వీకారం చేయించారు. తన మంత్రివర్గంలో 8 మందికి చోటు కల్పించారు. వీరిలో నలుగురు గత ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, మాజీ సీఎం బిప్లవ్ దేవ్ పాల్గొన్నారు. త్రిపురల ఎన్నికల్లో 30కి పైగా సీట్లు సాధించి బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది.

ముగిసిన జీ-20 జీపీఎఫ్ఐ సమావేశాలు:

జీ-20 అధ్యక్ష స్థానంలో భారత్ నిర్వహించిన రెండో గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ క్లాజన్ (జీపీఎఫ్ఐ) సమావేశాలు హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా ముగిసాయి. రెండ్రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో జీ-20 దేశాలతో పాటు ఇతర దేశాల ఆర్థిక శాఖ మంత్రులు, ప్రధాన బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. జీపీఎఫ్ఐ ప్లీనరీ సమావేశాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సులువుగా రుణ సౌకర్యాలు కల్పించే అంశాలపై చర్చించారు.

నాగాలాండ్ సీఎంగా నెయిఫియు రియో :

నేషనల్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) నేత నెయిఫియు రియో (72) నాగాలాండ్ సీఎంగా ఐదోసారి ప్రమాణం చేశారు. ఆయనతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలుగా, ఇతర మంత్రులు ప్రమాణం చేశారు. గవర్నర్ లా గణేశన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను ఇటీవల ఎన్నికల్లో ఎన్‌డీపీపీ -బీజేపీ కూటమి 37 చోట్ల విజయం సాధించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రతిపక్షం లేని అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వానికి సీఎం రియో నాయకత్వం వహిస్తున్నారు.

రియో 2003, 2008, 2013, 2018ల్లో సీఎం అయ్యారు. ఇప్పుడు తాజాగా 2023లోనూ 5వ సారి సీఎం కావడంతో నాలుగు సార్లు సీఎంగా ఉన్న ఎస్‌సీ జమీర్ రికార్డును రియో బద్దలు కొట్టారు.

మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణం:

మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ కాన్రాడ్ కె.సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. షిల్లాంగ్ లోని రాజ్ భవన్‌లో గవర్నర్ ఫగూ చౌహాన్ వీరి చేత పదవీ ప్రమాణం చేయించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పర్యాటక రంగంతోపాటు మౌలిక సదుపాయాలను, రహదారులు, విద్యుత్, నీటి వసతులను మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సంగ్మా తెలిపారు.

నౌక విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం:

దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయిని సాధించింది.

ఐఎన్ఎస్ విశాఖ నుంచి మధ్య శ్రేణి నౌకా విధ్వంసక క్షిపణిని ప్రయోగించింది.

అత్యంత వేగంతో దూసుకొచ్చే శత్రు దేశాల యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, గైడెడ్ బాంబులు, క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ నౌకలను సైతం నాశనం చేసే సామర్థ్యం ఈ మధ్యస్థ శ్రేణి క్షిపణికి ఉంది.

నేలపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే (ఎంఆర్ఎస్ఏఎం) వ్యవస్థ దీనికి ఉ:ది.

70 కి.మీ రేంజ్ లో ఉన్న లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల శక్తి వంతమైన ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ), ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది.

ఎంఆర్ఎస్ఏఎం ప్రత్యేకతలు:

పరిధి - 70 కి.మీ

ప్రొపల్షన్ - డ్యూయల్ పల్స్ - సాలిడ్ మోటార్.

వార్ హెడ్ - ప్రీ ఫ్రాగ్మెంట్

ప్రయాణ సమయం - 230 సెకన్లు

పొడవు - 4500 మీల్లీ మీటర్లు.

వ్యాసం - 225 మి.మీ

బరువు - 275 కిలోలు

లాంచర్ - షిప్ /వాహనం పై నిలువుగా ఉంటుంది.


Next Story

Most Viewed