విమర్శిస్తే.. దేశ ద్రోహమేనా?

by  |
విమర్శిస్తే.. దేశ ద్రోహమేనా?
X

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏ చిన్న వ్యాఖ్య చేసినా జాతి వ్యతిరేక చర్యగా పేర్కొంటున్నారు. దేశద్రోహం కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా ఆందోళనలు, నినాదాలు చేసేవారిపై ఇలాంటి కేసులు నమోదు చేయడం ఎక్కువైంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేశం ద్రోహం కేసులు అధికంగా నమోదు చేయడం గమనార్హం.
– ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అజాంగఢ్‌లో19 మంది ఆందోళనకారులపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. స్థానిక పార్కులో పౌరసత్వ సరవణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఇందుకు కారణం.
– జేఎన్‌యూ విద్యార్థి షార్జిల్ ఇమామ్‌కు మద్దతుగా నినాదాలు చేసినందుకు ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టీఐఎస్ఎస్) విద్యార్థి క్రిస్ చద్దావాలాపై దోశద్రోహం కేసు నమోదు చేశారు.
– కర్ణాటకలో ఓ విచిత్రమైన దేశద్రోహం కేసు నమోదైంది. బీదర్‌లోని ఓ స్కూల్‌లో నాలుగో, ఐదో తరగతి విద్యార్థులు సీఏఏకు వ్యతిరేకంగా నాటకం వేశారు. దీనిపై ఏబీవీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. స్కూల్ హెడ్‌మాస్టర్, ఓ విద్యార్థి తల్లిని అరెస్టు చేశారు.

ప్రభుత్వ వ్యతిరేక గొంతులు నొక్కడానికి, తన అసహనాన్ని చాటడానికి మాత్రమే దేశ ద్రోహం కేసులు నమోదు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఛార్జిషీటు కూడా దాఖలు చేయని కేసులు పెద్ద ఎత్తున ఉండటం ఇందుకు నిదర్శనం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం 2014 నుంచి 2016 వరకు దేశద్రోహం కింద మొత్తం 179 మందిని అరెస్టు చేశారు. వీటిల్లో 2016 చివరి వరకు 80 శాతం కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేయకపోవడం గమనార్హం. కోర్టుల్లో 90 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఐదేండ్ల కాలంలో 233 మందిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసినట్లు బుధవారం రాజ్యసభలో ప్రభుత్వం తెలిపింది. వీటిలో చాలా కేసుల్లో ఎవరికీ శిక్ష పడలేదని ఓ అధ్యయనం ద్వారా తెలిసింది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది

చీటికిమాటికి దేశ ద్రోహం కేసులు నమోదు చేయడాన్ని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఒక్కరు లేదా ఇద్దరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినంత మాత్రాన దేశానికి ప్రమాదకరమని భావించకూడదని, దేశద్రోహం కేసులు నమోదు చేయొద్దని 1952లో సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు చేసినంత మాత్రాన హింసాత్మక విప్లవానికి పిలుపు ఇచ్చినట్లు కాదని 1962లో మరో కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మధ్యకాలంలో జాతి వ్యతిరేకం, దేశద్రోహం అనే పదాలను అతి సాధారణంగా ప్రభుత్వం వినియోగిస్తోందని ఇటీవల ఓ కేసులో జస్టిస్ రోహింటన్ నారిమన్, జస్టిస్ ఎస్ రవీందర్ భట్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed