జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

by Disha Web Desk 12 |
జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
X

దిశ క్రైం బ్యూరో: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాల్ సెంటర్ ఉద్యోగి అయిన నిందితుడు జల్సాలు తీర్చుకోవటానికే దొంగతనం చేసినట్లు అంగీకరించాడని సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.52లో నివాసి, ప్రముఖ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణ రాజు అలియాస్‌ ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు ఇంట్లోకి కొన్ని రోజుల క్రితం రాత్రి 9.30 గంటల సమయంలో ముసుగు వేసుకున్న ఓ దొంగ చొరబడ్డాడు.

సత్యనారాయణ చిన్న కూతురు నవ్య బెడ్ రూంలోకి వచ్చి అరిస్తే చంపేస్తా అని కత్తితో బెదిరించాడు. ఈ హఠాత్‌ పరిణామంతో ఎనిమిదిన్నర నెలల గర్భిణి అయిన నవ్య వణికిపోయింది. తనను ఏమీ చెయ్యవద్దని ప్రాధేయపడ్డ నవ్య ఏం కావాలని అడిగింది. దానికి దుండగుడు 20 లక్షల రూపాయలు కావాలన్నాడు. అంత నగదు లేదని, ఇంట్లో అరకిలో నగలు, తన చెవులకున్న 15 లక్షల విలువ చేసే వజ్రాల కమ్మలు తీసుకోమని నవ్య చెప్పింది. అయితే, సదరు దొంగ ససేమిరా అన్నాడు. నగలు నట్రా కాదు తనకు నగదే కావాలన్నాడు.

ఓ వైపు నవ్యను బెదిరిస్తూనే గదిలో ఉన్న వైన్ తాగుతూ తన మొబైల్‌లో చాటింగ్ చేసిన దొంగ నగదు తెప్పించమన్నాడు. దీంతో నవ్య భర్తకు ఫోన్ చేసి అర్జెంటుగా 20 లక్షలు పంపమని చెప్పింది. అంత డబ్బు లేదన్న ఆమె భర్త తోడల్లుడుతో 8 లక్షలు పంపించాడు. దీనికి 2 లక్షలు జత చేసిన నవ్య మొత్తం 10 లక్షలు దొంగ చేతికి ఇచ్చింది. ఆ తర్వాత నవ్య మొబైల్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేసుకుని పరారయ్యాడు.

తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇటు టాస్క్ ఫోర్స్ అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు 8 బృందాలుగా విడిపోయి దొంగ కోసం వేట సాగించారు. గోవా తో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో గాలింపు జరిపారు. ఎట్టకేలకు ఈ ప్రయత్నాలు ఫలించి దొంగతనం చేసిన రాజేష్ యాదవ్ అనే యువకుడు పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. విచారణలో నేరాన్ని అంగీకరించిన రాజేష్ జల్సాల కోసం ఈ చోరీ చేసానని చెప్పినట్టు తెలిసింది. త్వరలోనే ఈ వివరాలను పోలీస్ అధికారులు వెల్లడించనున్నారు.



Next Story

Most Viewed