కష్టకాలం.. తిరిగి కోలుకోవడం అసాధ్యం

by  |
కష్టకాలం.. తిరిగి కోలుకోవడం అసాధ్యం
X

ముంబయి: లాక్‌డౌన్‌ ఆంక్షల్లో సడలింపులు పెరిగాయి. ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. తగిన జాగ్రత్తలు పాటిస్తూ చాలావరకు సంస్థలు, పరిశ్రమలు రోజువారీ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే నష్టపోయిన దాని నుంచి కోలుకోవడానికి, వీలైనంత వేగంగా మూలధనం పెంచుకోవడానికి నూతన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. కానీ, కొందరు వ్యాపారులు సంస్థలను కష్టమని చెబుతున్నారు. మరికొందరు తిరిగి కోలుకోవడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని తెలుపుతున్నారు. మరోవైపు కొన్ని రాష్ట్రాలు పరిస్థితులకు అనుగుణంగా డిమాండును దృష్టిలో ఉంచుకుని ఆర్థికవ్యవస్థ పుంజుకునే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అనే విషయంపై గత నెల 24 నుంచి 30 మధ్య ఆల్ ఇండియా మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్(ఏఐఎంవో) ఓ సర్వే నిర్వహించింది. స్వయం ఉపాధి, ఎంఎస్ఎంఈ, కార్పొరేట్ సీఈవోలు, ఉద్యోగులు ఇలా మొత్తం 46,525 మంది అభిప్రాయాలను ఏఐఎంవో సేకరించింది. కరోనా సంక్షోభంతో మూడింట ఒక వంతు చిన్న, మధ్యతరహా, స్వయం ఉపాధి వ్యాపారాలు తిరిగి కోలుకునే పరిస్థితి లేదని సర్వేలో స్పష్టమైంది. 37శాతం స్వయం ఉపాధి వ్యాపారులు, 35శాతం ఎంఎస్‌ఎంఈలు రికవరీ అసాధ్యమని వెల్లడించాయి. రికవరీ కావడానికి ఆరు నెలల సమయం పడుతుందని 32శాతం ఎంఎస్ఎంఈలు చెబితే, కేవలం 12శాతం మంది మాత్రమే మూడు నెలలు పడుతుందని చెప్పాయి.

నోట్లరద్దు, జీఎస్టీకు తోడైన కరోనా సంక్షోభం

కార్పొరేట్ కంపెనీలు కోలుకోవడానికి మరో మూడు నెలలు పట్టవచ్చని భావిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మూసివేయడానికి కరోనాతో ఏర్పడిన సంక్షోభం ఒకటే కారణం కాదని చెబుతున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. దీనికి కరోనా సంక్షోభం తోడు కావడంతో వ్యాపారాలు దెబ్బతీన్నాయి. ఇక దిక్కుతోచని స్థితిల్లో కంపెనీలు మూసివేయక తప్పట్లేదని యజమానులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా అప్పుల్లోనే వ్యాపాలు కొనసాగించినా కరోనా వైరస్ వల్ల కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఏఐఎంవో మాజీ ప్రెసిడెంట్ రఘునాథన్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని చెప్పారు. ఈ సర్వేలో కరోనా తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని 3శాతం ఎంఎస్ఎంఈలు, 6శాతం కార్పొరేట్ వర్గాలు, 11శాతం సెల్ఫ్ ఎంప్లాయిస్ పేర్కొన్నారు. అయితే, వీరిపై కరోనా సంక్షోభం ప్రభావం పడకపోవడానికి కారణం అత్యవసర సేవల్లో వీరు ఉండటమే కారణమని తెలిసింది. రికవరీ సాధ్యమయ్యే సూచనలు లేవని 32శాతం, కోలుకునేందుకు కనీసం 6నెలలు పడుతుందని 29శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఆ ఐదు రాష్ట్రాల్లో భేష్

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ నుంచి ఐదు రాష్ట్రాలు నెమ్మదిగా కోలుకుంటున్నాయని ఎలారా సెక్యూరిటీస్ స్టడీ తేల్చింది. దేశ జీడీపీలో 27శాతం వాటా కలిగిన ఈ రాష్ట్రాలు భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అండగా ఉంటాయని స్టడీ పేర్కొంది. తమిళనాడు, కేరళ, పంజాబ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లలోకి వ్యవసాయ ఉత్పత్తులు రావడం, విద్యుత్ వినియోగం, ట్రాఫిక్ రద్దీ, గూగుల్ మొబిలిటీ డేటా ఆధారంగా పరిస్థితి మెరుగవుతున్నట్టు తెలుస్తోందని స్టడీ వెల్లడించింది. జూన్ 8 నుంచి రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆధ్యాత్మిక కేంద్రాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించనుంది. దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.21లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ అతి ముఖ్యమైందని ఎలా సెక్యూరిటీ ఆర్థిక నిపుణులు గరిమా కపూర్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మరో ప్యాకేజీ ఉండదని వివరించారు.

డిమాండ్‌లో మార్పులు

గూగుల్ సెర్చ్ ఆధారంగా పరిశీలిస్తే వినియోగదారుల కొత్త జీవన విధానానికి అనుగుణంగా వినియోగ విధానాలను మారుస్తున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఎయిర్ కండిషనర్స్, బైకులు, సెలూన్ సేవలు, ఎయిర్ ట్రావెల్, వాక్యూం క్లీనర్స్, వాషింగ్ మెషిన్లకు డిమాండ్ పెరిగినట్టు సమాచారం. లాక్‌డౌన్ విధించిన కొత్తలో చాలా మంది అత్యవసర వస్తువులను మాత్రమే కొనుగోలు చేశారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, జ్యువెలరీ తదితర వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Next Story

Most Viewed