రాజస్తాన్‌ రాజకీయాల్లో ఆడియో టేపుల రచ్చ

by  |
రాజస్తాన్‌ రాజకీయాల్లో ఆడియో టేపుల రచ్చ
X

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఆడియో టేపుల కలకలం తీవ్రమవుతున్నది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోసే కుట్రకు పాల్పడిందని, ఆ కుట్రకు సంబంధించిన ఆడియో టేపుల సంభాషణల్లో వారి నేతల వాయిస్‌లున్నాయని కాంగ్రెస్ ఆరోపించిన తర్వాతి రోజు కాషాయ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ చెబుతున్నవన్ని కాకమ్మ కథలని పేర్కొంది. గెహ్లాట్ సర్కారును కాపాడుకోవడానికి చట్టవ్యతిరేక పద్ధతులను అవలంభించారా? అని ప్రశ్నించింది. నేతల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

బీజేపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ప్రజాస్వామ్య హత్యలో బీజేపీ పాత్రను స్వయంగా అంగీకరించిందని తిప్పికొట్టింది. హత్య చేస్తుంటే ఎందుకు రికార్డ్ చేశారని, అలా రికార్డ్ చేయడం చట్టబద్ధమేనా అన్నవే ఇప్పుడు ఆ పార్టీ సమస్యలని చురకలంటించింది. మరోవైపు రెబల్ ఎమ్మె్ల్యేల కోసం మనేసర్ చేరిన రాజస్తాన్ పోలీసులకు హర్యానా పోలీసులకు మధ్య హైడ్రామా నడిచింది.

సచిన్ వర్గీయులున్న ఎమ్మెల్యేల హోటల్‌కు వెళ్లడానికి తొలుత హర్యానా పోలీసులు నిరాకరించారు. తర్వాత అనుమతించినా ఎమ్మెల్యేలు అక్కడ లేరని తెలిసింది. రాజస్తాన్‌ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ యత్నించిందని, దానికి తమ దగ్గర ఆధారాలున్నాయని రెండు ఆడియో టేపుల సంభాషణ సారాన్ని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వినిపించిన సంగతి తెలిసిందే. ఆ టేపుల్లో కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్, అలాగే కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల వాయిస్‌లున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ టేపులపై స్పందిస్తూ కేంద్రమంత్రి ఆ వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. దర్యాప్తునకు తాను సిద్ధమేనని ప్రకటించారు.

కాంగ్రెస్‌లోనే అంతర్గత కుట్రలు: బీజేపీ

అసలు పాపం కాంగ్రెస్‌దేనని, కుట్రల్లోనే ఆ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆరోపణలు మాత్రం బీజేపీపై చేస్తున్నదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. ఈసారి కల్పిత ఆడియో టేపులతో బీజేపీపై ఆరోపణలు చేయడానికి ముందుకొచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ వాదిస్తున్నట్టు నిజంగానే రాజస్తాన్ సర్కారు ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడ్డదా? ఇది సున్నితమైన అంశం కాదు, చట్టపరమైన వివాదమని అన్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డదనుకున్నా.. నిబంధనలు పాటించారా? కేవలం బీజేపీనే కాదు, ప్రజలందరూ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, కాంగ్రెస్ కట్టుకథలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కల్పిత కథలు తమ నైతికతను దెబ్బతీయబోవు అని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. సంజయ్ జైన్ బీజేపీ నేతనేనా? అనే ప్రశ్ననూ దాటవేశారు.

నేరుగా ప్రమేయమున్నట్టు అంగీకరించింది: కాంగ్రెస్

రాజస్తాన్‌లో గతవారంలో రోజులుగా బహిరంగంగా ప్రజాస్వామ్యాన్ని హత్యచేసే బీజేపీ కుట్రలను చూశామని, ఇప్పుడు ఆ నేరంలో నేరుగా ప్రమేయమున్నట్టు ఆ పార్టీ అంగీకరించిందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ఏదో ఒక విధంగా బీజేపీకి ఈ కుట్రలో ప్రమేయమున్నట్టు కొత్తకొత్త అంశాలు ముందుకు వస్తూనే ఉన్నాయని, నేడు ఆ పార్టీనే తన పాత్రను ఒప్పుకున్నదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారి సమస్యల్లా తాము హత్య చేస్తుంటే ఎందుకు రికార్డ్ చేశారని, ఒకవేళ రికార్డు చేసినా అది చట్టబద్ధమేనా? అని చెప్పారు. అలా రికార్డు చేసి తమ గోప్యతను ఉల్లంఘించారు కదా అనే బాధపడుతున్నదని ఆరోపించారు. చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రం రాజస్తాన్ పోలీసులను అడ్డుకున్నదని, కుట్ర కేసులో నిందితులైన ఎమ్మెల్యేల వాయిస్ శాంపిళ్లు తీసుకోవడానికి వెళ్లిన రాజస్తాన్ పోలీసులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారని, హోటల్ వెనుకద్వారం గుండా రెబల్ ఎమ్మెల్యేలను తప్పించిందని ఆరోపించారు. దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా మనోహర్‌లాల్ కట్టార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. ఆ హోటల్ నుంచి నిందితులు కాని ఇతర ఎమ్మెల్యేలూ పరారయ్యారని, సచిన్ పైలట్ హర్యానా ప్రభుత్వన్ని నమ్మాల్సిన అవసరమేముందని, ఇవన్నీ బీజేపీ కుట్రను వెల్లడిస్తున్నాయని అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ పాలిత మరో రాష్ట్రం కర్ణాటకు తరలిస్తున్నట్టు సమాచారం అందిందని తెలిపారు.

రాజస్తాన్ ప్రజలపై భారం: మాజీ సీఎం వసుంధ రాజే

కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు రాజస్తాన్ ప్రజలు సమస్యలను అనుభవించాల్సి వస్తున్నదని రాష్ట్ర మాజీ సీఎం వసుంధర రాజే విమర్శించారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తడం దురదృష్టకరమని అన్నారు. అయితే, ఈ బురదలోకి బీజేపీని లాగాలని యత్నించడం సరికాదని తెలిపారు.

Next Story