వైద్యులకు వ్యాక్సినేషన్ పూర్తవ్వలేదా..?

by  |
covid vaccinations
X

న్యూఢిల్లీ: దేశంలో టీకా పంపిణీ మొదలు పెట్టి ఐదు నెలలు గడిచినప్పటికీ ఇంకా తొలి, ద్వితీయ ప్రాధాన్యతా వర్గాలుగా గుర్తించిన హెల్త్‌కేర్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పంపిణీ పూర్తికాకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తొలి డోసు తీసుకున్నవారు 82శాతంగా ఉండగా, రెండో డోసు తీసుకున్నవారి 56శాతమే ఉన్నది. అంటే, దాదాపు ఇంకా సగం మందికి టీకా పంపిణీ సంపూర్ణమవ్వలేదు. దేశంలో హెల్త్‌కేర్ సిబ్బంది సుమారు కోటి మంది ఉన్నారు. కరోనా బారినపడే ముప్పు వీరికే ఎక్కువ ఉన్నది. వైద్యారోగ్య సిబ్బంది తర్వాత రెండో ప్రాధాన్యత వర్గంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లను కేంద్రం గుర్తించింది. రెండు కోట్ల మంది జనాభాగా భావిస్తున్న వీరిలోనూ వ్యాక్సినేషన్ వెనుకబడి ఉంది.

సగటున 85శాతం మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా, సగానికి తక్కువగా 47శాతం మంది మాత్రమే రెండో డోసు తీసుకున్నారు. టీకా పంపిణీ విధానాన్ని సవరించిన తర్వాత వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సారథ్యంలో గురువారం సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో హెల్త్‌కేర్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి సంపూర్ణ వ్యాక్సినేషణ్ పూర్తవ్వకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తపరిచింది. కరోనాను ఎదుర్కొనే పోరులో వీరి పాత్ర కీలకమని, అందుకే వీరికి రెండు డోసుల వ్యాక్సిన్ వేగంగా పూర్తిచేయడం అత్యవసరమని తెలిపింది. అందుకే వెంటనే ఈ వర్గాలకు సెకండ్ డోసు వేయడంపై ఫోకస్ పెట్టాలని, అందుకు అనుగుణంగా స్పెషల్ టైమ్ స్లాట్స్ బుకింగ్ లేదా సెషన్స్ లేదా ఇతర కార్యక్రమాలు చేపట్టాలని వివరించింది.

ప్రైవేటు పాత్రపైనా నిరాశ

సవరించిన మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు హాస్పిటళ్లు 25శాతం టీకాలు కొనుగోలు చేసి పంపిణీ చేయాలి. కానీ, ఆశించిన స్థాయిలో ప్రైవేటు భాగస్వామ్యం టీకా పంపిణీలో కనిపించడం లేదని కేంద్రం సమీక్షలో అభిప్రాయపడింది. ప్రభుత్వ టీకా పంపిణీలో భాగస్వామ్యం పంచుకోవాల్సిన ప్రైవేటు హాస్పిటళ్లు ఆశించిన స్థాయిలో వ్యాక్సినేషన్ చేయలేవని, ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోంలలో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని వివరించింది.

జార్ఖండ్‌లో అత్యధిక టీకా వృథా

జార్ఖండ్‌లో అత్యధిక టీకా డోసులు(33.95శాతం) వృథా అయ్యాయని, ఛత్తీస్‌గడ్(15.79శాతం), పంజాబ్(7.08 శాతం), ఢిల్లీ(3.95శాతం), రాజస్తాన్(3.91 శాతం), ఉత్తరప్రదేశ్(3.78శాతం), గుజరాత్‌(3.63శాతం), మహారాష్ట్ర(3.59శాతం)లలోనూ వేస్టేజీ ఉన్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, కేరళ, పశ్చిమ బెంగాల్ ఆదర్శంగా నిలిచాయని వివరించింది. ఈ రెండు రాష్ట్రాల్లో టీకా వేస్టేజీ నెగెటివ్‌గా రిపోర్ట్ అయిందని తెలిపింది. కేరళ(-6.37శాతం), పశ్చిమ బెంగాల్(-5.48శాతం)లలో టీకా వృథా లేదని వివరించింది.


Next Story

Most Viewed