Lakshmi Mittal: యూకేకు గుడ్‌బై చెప్పనున్న బిలియనీర్ లక్ష్మీ మిట్టల్

by S Gopi |

'స్టీల్ కింగ్'గా పేరున్న లక్ష్మీ మిట్టల్, ఇప్పటికీ ఆయన కుటుంబానికి కంపెనీలో దాదాపు 40 శాతం వాటా ఉంది

Lakshmi Mittal: యూకేకు గుడ్‌బై చెప్పనున్న బిలియనీర్ లక్ష్మీ మిట్టల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో ఒకరైన లక్ష్మీ ఎన్ మిట్టల్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత యూకేను విడిచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. బ్రిటన్ బిలియనీర్ల జాబితాలో శాశ్వత పేరుగా భావించే భారతీయ సంతతికి చెందిన స్టీల్ వ్యాపారవేత్త, కీర్ స్టార్మర్ ప్రభుత్వం సూపర్-రిచ్‌లను ప్రభావితం చేసే పన్ను విధానంపై అసంతృప్తి కారణంగా మకాం మార్చుకుంటున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 'స్టీల్ కింగ్'గా పేరున్న లక్ష్మీ మిట్టల్, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఆర్సెలర్ మిట్టల్ ద్వారా తన సంపదను పెంచుకున్నారు. ఇప్పటికీ ఆయన కుటుంబానికి కంపెనీలో దాదాపు 40 శాతం వాటా ఉంది. రాజస్థాన్‌లో జన్మించి స్టీల్ తయారీ కుటుంబంలో పెరిగిన మిట్టల్, తన సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా దూకుడుగా విస్తరించారు. ఆయన తరంలో అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా మారారు.

లక్ష్మీ మిట్టల్ యూకేను ఎందుకు వీడుతున్నారు

ది సండే టైమ్స్ ప్రకారం, లక్ష్మీ మిట్టాల్ దాదాపు 15.4 బిలియన్ యూరోల(సుమారు రూ. 1.6 లక్షల కోట్ల) విలువైన సంపదతో యూకే ధనవంతుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. బ్రిటన్ ప్రభుత్వం నాన్-డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుది. ఈ విధానం అమల్లో ఉన్న కారణంగా యూకేలో నివశిస్తూ విదేశీ ఆదాయం సంపాదించే వారు ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. గత 2 శతాబ్దాలకు పైగా ఈ పన్ను చాలామందికి వెసులుబాటు కల్పించింది. దీన్ని ఇప్పుడు తొలగించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చాలామంది సంపన్నులు యూకేను వదిలి, పన్ను మినహాయింపు ఉండే దేశాలపై దృష్టి సారిస్తున్నారు.

మిట్టల్ ఎక్కడికి వెళ్తారు?

బ్రిటన్ ప్రభుత్వం కొత్త పన్నుల విధానం కారణంగా లక్ష్మీ మిట్టల్ దుబాయ్‌కు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో పెట్టబోయే పెట్టుబడులు కూడా దుబాయ్‌లోనే ఉండవచ్చని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Next Story