భారత వృద్ధికి తిరుగులేదు: కంపెనీల సీఈఓలు

by Dishanational1 |
భారత వృద్ధికి తిరుగులేదు: కంపెనీల సీఈఓలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిపై కంపెనీల సీఈఓలు అత్యంత విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది కాలంలో ఆర్థికవ్యవస్థతో పాటు తమ కంపెనీల వృద్ధి బాగుంటుందని సగానికిపైగా సీఈఓలు నమ్మకంతో ఉన్నారు. ప్రముఖ పరిశోధనా సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా దేశంలో కంపెనీల సీఈఓల నుంచి సేకరించి రూపొందించిన సర్వేలో దేశ జీడీపీ వృద్ధిపై సానుకూల అభిప్రాయాలు వెలువడ్డాయి. పీడబ్ల్యూసీ 27వ వార్షిక గ్లోబల్ సర్వే ప్రకారం, భారత్‌తో పాటు 105 దేశాలకు చెందిన సీఈఓల నుంచి వివరాలు సేకరించగా, భారత్‌కు చెందిన 86 శాతం మంది రాబోయే 12 నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. గ్లోబల్ సీఈఓల్లో 44 శాతం మంది మాత్రమే తమ దేశాల ఆర్థికవ్యవస్థ మెరుగ్గా ఉంటుందని చెప్పారు. దాదాపు 70 శాతం మంది భారత సీఈఓలు, 49 శాతం గ్లోబల్ సీఈఓలు రాబోయే మూడేళ్లలో తమ కంపెనీ ఆదాయ వృద్ధి అవకాశాలపై తమకు నమ్మకం ఉందన్నారు. పెట్టుబడులకు కేంద్రంగా భారత్ ఐదోస్థానంలో ఉంటుందని సీఈఓలు చెప్పగా, గతేడాది భారత్ 9వ ర్యాంకును సాధించింది. రానున్న 12 నెలలు కంపెనీలకు ద్రవ్యోల్బణం, సైబర్ దాడులు ప్రధాన ముప్పుగా ఉంటుందని భారత సీఈఓలు భావిస్తున్నారు. 'అంతర్జాతీయంగా ప్రతికూలత కొనసాగుతున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో మెరుగైన వృద్ధి అంచనాతో భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉండొచ్చు. భారత 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించడంతో కంపెనీల సీఈఓలు కీలక పాత్ర పోషించనున్నారని ' పీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ సంజీవ్ కిషన్ పేర్కొన్నారు.


Next Story