నువ్వు బిలియనీర్ అంబానీ అయితే నేను మిడిల్ క్లాస్ అంబానీని

by  |
నువ్వు బిలియనీర్ అంబానీ అయితే నేను మిడిల్ క్లాస్ అంబానీని
X

దిశ, వెబ్‌డెస్క్ : అంతా హస్త వ్యస్తం. అంతులేని ఆర్ధిక నష్టం. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. పేద, ధనిక తేడా తెలియదు. అందరితోనూ ఆడుకుంటోంది మహమ్మారి కరోనా వైరస్. కంటికి కనిపించని వైరస్ ప్రపంచ దేశాల్ని వణికిస్తుంటే .., ఎవరో చేసిన పాపానికి ఇంకెవరో మూల్యం చెల్లిస్తున్న ఆపత్కాలం. ఇలాంటి మహా సంక్షోభంలో దేశాల ఆర్ధిక వ్యవస్థలన్నీ నేలచూపులు చూస్తున్నాయి. దీంతో పేదవాడు మరింత పేదవాడవుతుంటే ధనికుడు మరింత ధనవంతుడవుతున్నాడు.

ఇటీవల ఇండియా ఇన్ఫోలైన్ విడుద‌ల చేసిన ఇండియా రిచ్ లిస్ట్- 2020 ప్రకారం రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ గంటకు అక్షరాల రూ. 90 కోట్లు అంటే నిమిషానికి కోటిన్నర సంపాదిస్తున్నారు. అదే ఓ చిరు వ్యాపారి 8 గంట‌లు కష్టపడితే 50 రూపాయ‌లు కూడా సంపాదించ‌డం క‌ష్ట తరమైంది. కానీ, అదే చిరువ్యాపారికి అనుకోని అదృష్టం సోషల్ మీడియా రూపంలో తలుపు తట్టింది. రెండు నెలల క్రితం రోడ్ సైడ్ ఓ చిన్న దాబా నడుపుకునే పెద్దాయన.., ఇప్పుడు మిడిల్ క్లాస్ అంబానీలా మారిపోయారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ పై తాము చేసిన ఉడత సాయంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. సౌత్ ఢిల్లీ మాళ‌వీయ న‌గ‌ర్ ప్రాంతంలోని రోడ్డు పక్కన వృద్ధ దంపతులు వరప్రసాద్, దేవీలు గత 30 ఏళ్లుగా బాబా క దాబా పేరుతో ఓ చిన్న హోటల్ ను రన్ చేస్తున్నారు. కరోనా తో తలెత్తిన సంక్షోభం వల్ల.., కరోనా వ్యాప్తి ముందు నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు సంపాదిస్తే .., కరోనా కారణంగా భోజన ప్రియులు ఆ దాబాలో తినడం మానేశారు. రోజురోజుకు పరిస్థితి చేయిదాటిపోతుంది. ఏం చేయాల్రా భగవంతుడా అనుకుంటూ రోజుల్ని నెట్టుకొస్తున్న ప్రసాద్ దంపతులకు ఓ రోజు అనుకోని అదృష్టం ఫుడ్ యూట్యూబర్ గౌరవ్ వాసన్ రూపంలో వచ్చింది.

గౌరవ్ వాసన్ రకరకాలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ను టేస్ట్ చేసి..వాటిని వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టేవాడు. అదే సమయంలో మాళవీయ నగర్ నుంచి మరో ప్రాంతానికి వెళుతున్న గౌరవ్ చూపు రోడ్డు పక్కనే ఉన్న బాబా క దాబా పై పడింది. ఆ దాబాకి వచ్చిన కష్టమర్లకు వృద్ద దంపతులు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేస్తూ కనిపించారు. సర్వే చేస్తున్న వరప్రాసద్ వద్దకు వెళ్లి ఏం తాత ఎలా ఉన్నావ్. బిజినెస్ ఎలా న‌డుస్తుంది అంటూ వారితో మాట..మాట క‌లిపాడు. మాట్లాడుతూనే వాళ్లు చేసిన ఫుడ్ ఐట‌మ్స్ టేస్ట్ చేశాడు. చాలా బాగున్నాయి

మాటల మధ్యలో తాత ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయ్. రోజూ ఎంత సేల్ చేస్తావ్ అంటూ కుతూహలంగా అడిగాడు. అంతే ఆరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాబాలో ఫుడ్ ఐటమ్స్ అమ్మగా వచ్చిన రూ.50 చూపిస్తూ కన్నీటి పర్యంతరమయ్యాడు ప్రసాద్. వయసు అయిపోతుంది. కంట్లో శుక్లాలు ఉన్నాయి. బిజినెస్ చూస్తే తిండికూడా తినలేని పరిస్థితి అంటూ బాధను వెళ్లగక్కాడు. బ‌రువెక్కిన హృదయంతో గౌర‌వ్.., తాత‌ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. తాత..! నువ్వేం కంగారు పడకు అంటూ.. దాబా గురించి, అందులో ఫుడ్ ఐటమ్స్, వాటి టేస్ట్ ఎలా ఉందో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు. అంతే వృద్ద దంప‌తుల దశ దెబ్బకు తిరిగింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సోషల్ మీడియాలో బాబా క దాబా పేరు మారు మ్రోగింది. మానవత్వం పరిమళించింది. ఇలా హోటల్ కు వచ్చిన ప్రతీ ఒక్కరూ బాబా క దాబా వద్దకు రావడం ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయడం.., వాటి గురించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాబా క దాబా గురించి బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు వారికి సాయం చేయాలని పిలుపునిచ్చారు.

సోషల్ మీడియా కథనాలపై ఓ ప్రముఖ కంటి ఆస్పత్రి వైద్యులు ఆయనకు ఉచితంగా ట్రీట్మెంట్ చేశారు. మరికొంత మంది విరాళాలు ఇచ్చారు. ఫుడ్ డెలివరీ యాప్స్ సైతం బాబా క దాబా ఫుడ్ ఐటమ్స్ ను డెలివరీ చేస్తామని ముందుకొచ్చాయి. సేల్ పెరిగింది. అంతకు ముందు రోజుకు రూ.50 రావడమే గగనంగా ఉండగా..ఇప్పుడు రోజుకు రూ.4వేల నుంచి రూ.5వేలు బిజినెస్ జరగడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బాబా క దాబా ఓనర్ తమపేరు చెప్పి గౌరవ్ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు బాబా క దాబా ఓనర్ ప్రసాద్ మిడిల్ క్లాస్ అంబానీ అయ్యారు. అదే మాళవీయ నగర్ లో బాబా క దాబా ప్లేస్ లో రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబా క దాబా ఓనర్ ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా సోషల్ మీడియా వల్లే సాధ్యమైంది. మన హోటల్ లో ఇద్దరు చెఫ్‌లతో భారతీయ వంటకాలతో పాటు చైనీస్ వంటకాలు అందిస్తున్నామని… కాంతా ప్రసాద్ బోసినవ్వుతో కష్టమర్లను ఆహ్వానిస్తున్నారు. పాత హోటల్ కూడా నడిపిస్తామని, అది ఉండగానే కొత్త రెస్టారెంట్ ప్రారంభించామని చెప్పారు. రెస్టారెంట్ లాభాల బాటలో నడుస్తుందని కాంతా ప్రసాద్‌తో కలిసి పని చేస్తున్న తుశాంత్ అద్లఖ అనే సామాజిక కార్యకర్త ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బాబా కా న్యూ దాబా’ ప్రారంభంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూ‌ట్యూబర్ గౌరవ్ ప్రచారం వల్లే బాబా పరిస్థితులు మెరుగుపడ్డాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. న్యూ హోటల్‌కు ఒకసారి రావాలని ఉందని, తప్పక వస్తామని పలువురు అంటున్నారు.



Next Story

Most Viewed