Ayyannapatrudu: అవినాశ్‌రెడ్డిని కాపాడటమే వైసీపీ ఎంపీల పని

by Disha Web Desk 16 |
Ayyannapatrudu: అవినాశ్‌రెడ్డిని కాపాడటమే వైసీపీ ఎంపీల పని
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీకి చెందిన 30 మంది ఎంపీలకు అవినాశ్ రెడ్డిని కాపాడటం తప్ప మరే పని లేదని విమర్శించారు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కర్నూలుకు సీబీఐ అధికారులు వస్తే వైసీపీ గూండాలు అడ్డుకోవడం వెనుక పెద్దల హస్తం ఉందని అయ్యన్న అనుమానం వ్యక్తం చేశారు.

తన తండ్రి హత్యకేసులో నిందితులకు జైలు శిక్ష పడాలని వివేకానందారెడ్డి తనయ వైఎస్ సునీతారెడ్డి చేస్తున్న పోరాటాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ సునీతారెడ్డికి రాష్ట్ర ప్రజలంతా తమ సంపూర్ణమద్దతు తెలియజేయాలని కోరారు. ఇకపోతే అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్ రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. ఏళ్ల తరబడి కోర్టుకు వెళ్లకుండా ఉన్న ఘనత దేశ చరిత్రలో జగన్‌కి మాత్రమే దక్కుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

Next Story