Visakha: 24 గంటల్లో అలా చేయగలరా?.. పురంధేశ్వరికి మంత్రి అమర్‌నాథ్ సవాల్

by Disha Web Desk 16 |
Visakha: 24 గంటల్లో అలా చేయగలరా?.. పురంధేశ్వరికి మంత్రి అమర్‌నాథ్ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీని గెలిపించడానికి పురంధేశ్వరి తాపత్రయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మడం లేదా అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విశాఖలో జరిగిన భూ దందాపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. సీఎంను ఒప్పించి 24 గంటల్లో భూములు ఇప్పిస్తామని, విశాఖ రైల్వే జోన్‌పై ప్రకటన చేయించాలని మంత్రి అమర్‌నాథ్ సవాల్ చేశారు.

పురంధేశ్వరి అసలేం మాట్లాడారంటే...

అంతకుముందు పురంధేశ్వరి విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. కేంద్రం నిధులిస్తే జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేస్తున్నా ఏమీ ఇవ్వడం లేదంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. కేంద్ర నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తూ జేబులు నింపుకోవటమే ఈ పరిస్థితులకు కారణమన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో మౌలిక వసతుల కల్పనకు కేంద్రప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం గుంతల రోడ్లతో ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. రోడ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైల్వే జోన్‌కు కేంద్రం కట్టుబడి ఉందని, ఆ దిశగా చకచకా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విభజన హామీలను చాలా వరకు కేంద్రం అమలు చేసిందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

Next Story