రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అధికారులు?

by Dishanational1 |
రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అధికారులు?
X

పేదలకు ఉచితంగా అందించాల్సిన రేషన్ బియ్యాన్ని అధికారులే పక్కదారి పట్టిస్తున్నారు. ప్రజల నోటికాడ ముద్దను లాగేసుకుంటూ అక్రమాలకు తెర తీస్తున్నారు. ప్రజా బియ్యానికి రక్షణగా ఉండాల్సిన వారే కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా మింగేస్తున్నారు. మరి కొందరు బినామీ దందా నడుపుతూ రెవెన్యూ శాఖకు మాయనిమచ్చ తీసుకొస్తున్నారు.

దిశ, ఎర్రగొండపాలెం: దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గ్రామంలో సిగ్నల్ ఉన్నా ఆన్ లైన్ పనిచేయదు.. అంతా ఆఫ్ లైన్ లోనే ప్రభుత్వ బియ్యం పంపిణీ చేస్తున్నారు. పంచాయతీలో రేషన్ డిపోలను డీలర్లకు ఇవ్వకుండా వీఆర్ఏలను బినామీలుగా పెట్టి భారీగా రేషన్ దందాకు పాల్పడుతున్నారు. ఆ గ్రామ రెవెన్యూ అధికారి మోహన్ రావు అధ్యక్షతన ఈ వ్యవహారం మొత్తం జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఆఫ్ లైన్ లోనే ఎందుకు ?

ఆన్ లైన్ లేదంటూ ముందుగానే లబ్ధిదారుల పేర్లను ఒక పుస్తకంలో నమోదు చేసుకుని కొంతమందికి మాత్రమే బియ్యం ఇస్తూ మిగతా వారికి కిలో పది రూపాయలు చొప్పున డబ్బులు చెల్లిస్తూ దందా కొనసాగిస్తున్నారు. దోర్నాల మండలంలోని 11 గ్రామ పంచాయతీలలో కూడా ఇలాగే ఆఫ్ లైన్ పద్ధతిలోనే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అన్నిచోట్ల ఇలాంటి అక్రమాలు భారీగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. నాయకులుగా చలామణి అవుతూ ఇలాంటి చీకటి వ్యాపారానికి స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో కొనసాగిస్తున్నారంటూ పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదులు అందినా చర్యలు శూన్యం

ఈ దందా విషయమై దోర్నాల తహశీల్దార్ వై వేణుగోపాలరావుకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం ఏరియా రేషన్ డిపో టీటీ తిరుపతిరెడ్డిని వివరణ కోరగా దోర్నాల మండలంలో మొత్తం 11 ఆఫ్ లైన్ రేషన్ షాపులు ఉన్నాయని తెలిపారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీలలో కార్యకలాపాలు ఆన్ లైన్ పద్ధతిలో జరుగుతుండగా మరి బియ్యం పంపిణీ మాత్రం ఆఫ్ లైన్ లో కొనసాగించడం వెనుక ఆంత్యరేమిటో రెవెన్యూ అధికారులే సెలవివ్వాలి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నారు.



Next Story