గర్భిణీపై దాడి కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుడిది వైసీపీ కాదు!!

by Thanuru Gopichand |   (  Updated:2025-12-24 06:10:01  IST  )

కదిరి నియోజకవర్గం పరిధిలోని తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై దాడి జరిగిన ఘటన విదితమే.

గర్భిణీపై దాడి కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుడిది వైసీపీ కాదు!!
X

దిశ, వెబ్ డెస్క్ : కదిరి నియోజకవర్గం పరిధిలోని తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై దాడి జరిగిన ఘటన విదితమే. వైయస్ జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా వైసీపీ కార్యకర్తలతో గర్భిణికి వివాదం జరిగింది. ఈ క్రమంలో అజయ్ దేవ్ అనే యువకుడు ఆమెపై దాడి చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిగా ఉన్న అజయ్ దేవ్ ను విచారించడమే కాకుండా వీధుల్లో ఊరేగించారు. అయితే నిందితుడిని వైసీపీ కార్యకర్తగా తొలుత ప్రచారం చేశారు. అయితే అతను వైసీపీ కార్యకర్త కాదని.. జనసేన కార్యకర్తని మరో వాదన తెరపైకి వచ్చింది. అందుకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నిందితుడు అజయ్ దేవ్ జనసేన కార్యకర్తగా గుర్తించడం జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. అతను చేసిన దాడిని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. అతను తమ కార్యకర్తనే అని జనసేన ఎంపీటీసీ అమర్ అంగీకరించారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తో అజయ్ ఉన్న ఫోటోలను కూడా పంచుకుంటున్నారు. అయితే నిందితుడు నిజంగానే పార్టీ కార్యకర్తనా లేక పార్టీలో సాధారణంగా తిరుగుతూ ఉంటాడా అని తెలియాల్సి ఉంది. ఒకవేళ వైసీపీ అయినా, జనసేన అయినా అతనికి క్రియాశీలక సభ్యత్వం ఉందా అనేది సందేహాస్పదమే. ఈ క్రమంలో ఒక అమానవీయ ఘటనను రాజకీయం చేయడం కోసమే పార్టీలు నిందితుడికి ఫలానా పార్టీ అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ నిజంగానే ఇరు పార్టీల్లోని ఏదో ఒక పార్టీకి చెందిన కార్యకర్త అని నిర్ధారణ అయితే.. భవిష్యత్తులో తమ కార్యకర్తలు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీలపై ఉంది. నేరాలు జరిగినప్పుడు నిందితులకు పార్టీలు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాలు అంటగట్టడం మాని.. బాధితులకు న్యాయం జరిగేలా చూడటంపై ఫోకస్ పెడితే సమాజంలో వైషమ్యాలు తగ్గుతాయనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Next Story