గాంధీలో ఇంత దారుణమా.. ధనిక రాష్ట్రంలో రూ.10 లక్షలు లేవా..?

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌కు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. సుమారు ఏడాదిన్నర కాలంగా కొవిడ్ రోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రిగా సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవల సంగతి పక్కన పెడితే.. కనీసం వాడుక నీటి కోసం రోగులు, వారి సహాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. 1200 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి రాష్ట్రంలోనే ఎంతో పేరుంది. ఇక్కడ […]

Update: 2021-07-30 20:00 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌కు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. సుమారు ఏడాదిన్నర కాలంగా కొవిడ్ రోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రిగా సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవల సంగతి పక్కన పెడితే.. కనీసం వాడుక నీటి కోసం రోగులు, వారి సహాయకులు పడరాని పాట్లు పడుతున్నారు.

1200 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి రాష్ట్రంలోనే ఎంతో పేరుంది. ఇక్కడ కరోనా సేవలు మొదలైన నాటి నుంచి పడకల సామర్ధ్యం పెంచారు. కొవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన వాటితో కలిపి పడకల సంఖ్య ప్రస్తుతం 1890కి చేరింది. వీటిల్లో 650 ఐసీయూ, 600 ఆక్సిజన్, 640 సాధారణ పడకలు ఉన్నాయి. ప్రతినిత్యం 2 వేల వరకు ఓపీ విభాగానికి రోగులు వస్తుంటారు.

నిత్యం రద్దీగా ఉండే హాస్పిటల్‌‌లో ఇందుకు తగ్గట్లుగా వసతులు కరువయ్యాయి. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో వాడుక నీరు లేక రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. గతంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్న సమయంలో తరచుగా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి పరిష్కారం చూపేవారు. ఆయన రాజీనామా అనంతరం ఈ శాఖ సీఎం కేసీఆర్ వద్దనే ఉంది. ఆయన శాఖకు అంతగా సమయం కేటాయించకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గాంధీ వంటి పెద్దాస్పత్రులలో వసతుల లేమితో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆస్పత్రి అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో సమస్యలు మరింత జఠిలంగా మారుతున్నాయి.

టాయిలెట్‌ కు వెళ్లాలంటే నీటికి తిప్పలు..

గాంధీ ఆస్పత్రిలో వాడుక నీటి కోసం మొత్తం 7 బోర్లు వేశారు. వీటిల్లో 4 బోర్లు ఐపీ భవనంలో, మరో 3 బోర్లు ఓపీ భవనంలో ఉన్నాయి. అయితే సుమారు పక్షం రోజులుగా మోటార్లలో సాంకేతిక లోపం ఏర్పడడంతో పని చేయడం లేదు. ఈ ప్రభావంతో ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. ఫలితంగా టాయిలెట్లలో నీరు లేకుండా పోయింది. దీంతో ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లుగా చేరిన రోగులు, వారి సహాయకులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆస్పత్రి ఆవరణలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన త్రాగు నీరును క్యూ లైన్లో నిల్చుని పట్టుకుని ఆ నీటిని బాత్ రూమ్‌లలో వినియోగిస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు.

కంపు కొడుతున్న బాత్‌రూమ్‌లు..

గాంధీ ఆస్పత్రిలో నీటి కొరత కారణంగా బాత్రూంలు కంపుకొడుతున్నాయి. వీటిల్లోకి వెళ్లడం సంగతి అటుంచితే దుర్గంధం వార్డుల్లోకి వస్తోంది. దీంతో వీటిల్లోకి వెళ్లాలంటే రోగులు, వారి సహాయకులు జంకుతున్నారు. గత్యంతరం లేక త్రాగునీటిని సీసాలలో నింపుకుని టాయిలెట్లకు వెళ్తున్నారు. అయితే ఆస్పత్రిలోని రోగులంతా వాడుక నీటి కోసం త్రాగునీటి సరఫరా కేంద్రాల వద్దకు వస్తుండడంతో ఇక్కడ క్యూ లైన్ పెరిగిపోతోంది. ఓ వైపు టాయిలెట్లకు వెళ్లడం అర్జంట్ కాగా మరోవైపు నీటి కోసం ఎదురు చూస్తూ లైన్లో నిల్చోవల్సి వస్తోంది. కొంత మంది రోగులు వారి సహాయకులను నీటి కోసం లైన్‌లో నిల్చోపెట్టి బాత్రూంలకు పరుగులు తీస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

మరమ్మత్తులకు రూ 10 లక్షలు..

సుమారు 15 రోజుల క్రితం ఆస్పత్రిలో బోర్ మోటార్లు చెడిపోయాయి. నాటి నుంచి ఆస్పత్రిలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. అయితే, బోర్ల మరమ్మత్తు పనులు గ్రౌండ్ ఫోర్స్ సంస్థ చూసేది. వారంటీ పీరియడ్ 7 ఏండ్లు దాటి పోవడంతో సంస్థ మోటార్ల మెయింటెనెన్స్‌ను పట్టించుకోవడం లేదు. దీంతో చెడిపోయిన బోర్లకు మరమ్మత్తులు చేయించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మోటార్లు చెడిపోయిన సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు.. సంస్థ ప్రతినిధులను కలిసి మరమ్మత్తులు చేయాలని కోరడంతో వారు రూ.10 లక్షల ఖర్చుతో కొటేషన్ ఇచ్చారు. అయితే రూ.5 లక్షల వరకే సూపరింటెండెంట్ పరిధిలో అత్యవసరంగా ఖర్చు చేసే అధికారం ఉండడంతో సమస్యను హెచ్‌డీ‌ఎస్ చైర్మన్‌గా ఉన్న జిల్లా కలెక్టర్‌కు నిధుల మంజూరు కోసం ఫైలు పంపారు. ఇది జరిగి వారం దాటినా కలెక్టర్ నుంచి ఎలాంటి సమావేశం గానీ, అనుమతులు గానీ లేకపోవడంతో వీటి మరమ్మత్తు పనులు నిలిచిపోయాయి. దీంతో తెలంగాణ ఎప్పటికీ ధనిక రాష్ట్రమే అంటూ కేసీఆర్ పలుమార్లు వ్యాఖ్యానించడంతో… ఆస్పత్రిలో బోరు బాగు చేసేందుకు రూ. 10 లక్షలు కూడా లేవా అంటూ ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం..

గాంధీ ఆస్పత్రిలోని బోర్లకు హై ఎండ్ మోటార్లు వేశారు. ఇవి ఒకదానికి ఒకటి అనుసంధానం అయిఉండడంతో ఒకటి చెడిపోతే అన్ని పని చేయడం లేదు. దీంతో నీటి ఎద్దడి ఏర్పడింది. మోటార్ల మరమ్మత్తుల కోసం గ్రౌండ్ ఫోర్స్ సంస్థ ను సంప్రదించాం. అయితే వారంటీ పీరియడ్ దాటిపోవడం, ఖర్చు కూడా రూ 10 లక్షలు అవుతుందని చెప్పడంతో వాటికి నిధులు కేటాయించే అధికారం నా పరిధిలో లేదు. దీంతో హెచ్‌‌డీఎస్ నిధుల నుంచి నిధులు కేటాయించాలని చైర్మన్ గా ఉన్న జిల్లా కలెక్టర్ కు ఫైలు పంపాం. డబ్బులు రాగానే సమస్యకు చెక్ పెడతాం. డాక్టర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్.

Tags:    

Similar News