రూటు మార్చిన KCR.. పార్టీ వీడుతున్న నేతల విషయంలో స్ట్రాటజీ చేంజ్!

నేతలు పార్టీని వీడుతుండటం.. మరోవైపు కేడర్‌లో నైరాశ్యం ఉన్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడంపై కేసీఆర్ దృష్టిసారించారు.

Update: 2024-04-30 02:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నేతలు పార్టీని వీడుతుండటం.. మరోవైపు కేడర్‌లో నైరాశ్యం ఉన్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడంపై కేసీఆర్ దృష్టిసారించారు. నేతల పనితీరుపై హెచ్చరికలు లేకుండా కేవలం బుజ్జగింపులు చేస్తున్నారు. భవిష్యత్ బీఆర్ఎస్‌దేనని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పార్టీలో యాక్టీవ్‌గా పనిచేస్తున్న ద్వితీయశ్రేణి నాయకుల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తానని నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోపణలు ఉన్న నేతలను మాత్రం సున్నితంగా మందలిస్తున్నట్లు తెలిసింది.

గతంలో నేతల పనితీరుపై కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకునేవారు. పనితీరు బాగోలేనివారిని హెచ్చరించేవారు. పనితీరు మెరుగుపడకపోతే టికెట్ కట్ అని, పార్టీ పదవులు సైతం రావని ఖరాకండిగా చెప్పేవారు. దీంతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారంటే నేతలు భయపడేవారు. కానీ, ఇప్పుడు అది రివర్స్ అయింది. ఒక్క అసెంబ్లీ ఓటమితో పార్టీకి గడ్డుకాలం ఏర్పడింది. పార్టీలోని సీనియర్ నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. నిత్యం ఎవరోఒకరు కారు దిగుతూనే ఉన్నారు. దీంతో పార్టీని గాడిలో పెట్టే పనిలో గులాబీ నేత నిమగ్నమయ్యారు.

లోక్ సభ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించేందుకు రోడ్డుషోలను ఈ నెల 24 నుంచి స్టార్ట్ చేశారు. రోడ్డుషో తర్వాత ఆయా జిల్లా కేంద్రాల్లోనే బస చేస్తూ ఆ ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ అవుతున్నారు. పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు నేతలకు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. గతానికి భిన్నంగా నేతలందరితో మాట్లాడటంతో పాటు ఉదయం ఆయా వర్గాలకు చెందిన ప్రజలతో భేటీ అవుతూ సమస్యలు తెలుసుకుంటుండటం గమనార్హం.

ద్వితీయశ్రేణి నాయకుల వివరాలు సేకరణ

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ద్వితీయశ్రేణి నాయకులకు ప్రాధాన్యత కరువైంది. కేవలం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలనే సుప్రీం చేయడంతో వారిది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. వారి అనుచరులకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చారు. యాక్టీవ్‌గా ఉన్న నేతలపైనా, పార్టీలోని లోపాలను ఎత్తిచూపిన నేతలను రాజకీయంగా అణిచివేశారని నేతలే పేర్కొంటున్నారు. అయితే, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ నేతలంతా పార్టీని మారుతుండటంతో నియోజకవర్గాల్లో పార్టీని నడిపేవారే కరువయ్యారు.

హుజూర్ నగర్, ముధోల్, సిర్పూర్‌లో మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ నియోజకవర్గంలో పార్టీని నడిపే నాయకుడు లేకుండాపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకొని పార్టీ అధినేత కేసీఆర్ సెకండ్ స్థాయి నేతలను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అందులో భాగంగానే రోడ్డుషో సమయంలో బస చేస్తున్న నేత ఇంటివద్దనే జిల్లా నేతలందరితో భేటీ అవుతూ పార్టీలో యాక్టీవ్‌గా పనిచేసే నేతల వివరాలను సేకరిస్తున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ఎంతమంది ఉన్నారని ఆరా తీస్తున్నారు. రాబోయే ఎన్నికలనాటికి బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు.

ఆరోపణలున్న నేతలకు మందలింపు

బీఆర్ఎస్‌లో పనిచేస్తున్న కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులపై దురుసు ప్రవర్తన, భూకబ్జా, సెటిల్ మెంట్లు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. రోడ్డుషోకు వెళ్లిన సందర్భంలో నేతల భేటీలో ఆరోపణలు ఉన్నవారందరిని సున్నితంగా మందలిస్తున్నట్లు సమాచారం. తీరు మార్చుకోవాలని, గతంలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా ప్రజాసమస్యలపై దృష్టిసారించాలని సూచిస్తున్నట్లు తెలిసింది

పార్టీని బలోపేతం చేద్దామంటూ...

పార్టీ బలోపేతానికి చర్యలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు నేతల భేటీలో కేసీఆర్ పేర్కొంటున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని కమిటీలను పూర్తి స్థాయిలో వేస్తామని, ఉద్యమకాలంలో పార్టీ ఎలా పనిచేస్తుందో అలా చేస్తామని నేతలకు భరోసా కల్పిస్తున్నారు. పార్టీకి భవిష్యత్ ఉందని, ఇతర పార్టీలోకి వెళ్లి ఇబ్బందులు పడొద్దని సూచనలు చేస్తుండటం గమనార్హం.

Read More...

BJPకి వరం అదే.. బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్ 





Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News