రూ. 3 లక్షల కోట్లను దాటనున్న టెక్స్‌టైల్స్ ఎగుమతులు!

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత టెక్స్‌టైల్స్ ఎగుమతులు 40 బిలియన్ డాలర్ల..telugu latest news

Update: 2022-03-09 17:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత టెక్స్‌టైల్స్ ఎగుమతులు 40 బిలియన్ డాలర్ల(రూ. 3 లక్షల కోట్ల)ను అధిగమిస్తాయని టెక్స్‌టైల్స్ సెక్రటరీ యూబీ సింగ్ బుధవారం ఓ కార్యక్రమంలో అన్నారు. ప్రధానంగా ఈ ఎగుమతులకు పత్తి నూలు రవాణా గరిష్ఠంగా దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ మెరుగైన ఎగుమతులను సాధిస్తున్న వేళ వృద్ధిని పెంచేందుకు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ధరల పెరుగుదల వల్ల మాత్రమే కాకుండా అన్ని రకాలుగా టెక్స్‌టైల్స్ ఎగుమతులు వృద్ధి సాధించేలా పరిశ్రమ వర్గాలు ప్రణాళిక కలిగి ఉండాలన్నారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన జౌళి శాఖ మంత్రి.. కృత్రిమ ఫైబర్ వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. కాగా, కొవిడ్ మహమ్మారి కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో 40 శాతం క్షీణించిన దేశీయ రిటైల్ దుస్తుల పరిశ్రమ ఆదాయం ఈ ఏడాది 20-25 శాతం పెరుగుతుందని ప్రముఖ పరిశోధనా సంస్థ క్రిసిల్ అంచనా వేసింది.

సంక్షోభ పరిస్థితుల తర్వాత పెరిగిన అధిక డిమాండ్‌తో పరిశ్రమ వృద్ధి మెరుగ్గా ఉండనుందని క్రిసిల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. నిర్వహణ మెరుగ్గా కొనసాగడం, ఖర్చుల నియంత్రణ సహా పలు సానుకూల పరిణామాలతో రిటైల్ దుస్తుల వ్యాపారులు మెరుగైన ఆదాయాన్ని సాధించనున్నారు. గత ఆర్థిక సంవత్సరం వ్యాపారులు రూ. 2,000 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నారు. గతేడాది ద్వితీయార్థంలో కరోనా సంబంధిత ఆంక్షలు తొలగడం, కేసులు నెమ్మదించడంతో గిరాకీ పెరిగింది. ఏడాది చివర్లో పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ మద్దతుతో అమ్మకాలు 55-60 శాతం పెరిగాయని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనూజ్ సేథీ పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ కూడా 8-10 శాతం తో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News