ఈ స్కూల్లో ఫీజుకు బదులు ప్లాస్టిక్ ఇస్తే చాలు.. ఎక్కడో కాదండోయ్.. మన దగ్గరే..

చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులు వచ్చాయి.

Update: 2024-04-30 04:33 GMT

దిశ వెబ్ డెస్క్: చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులు వచ్చాయి. మెరుగైన విద్య కావాలంటే లక్షలకు లక్షలు చెల్లించాల్సిందే, అంటున్నారు పాఠశాలల యాజమాన్యం. అలాంటి ఈ పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ స్కూల్ మిగతా ప్రైవేట్ స్కూల్ అన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ప్రైవేట్ స్కూల్ పేరుకి చాలా ఫేమస్, అంత పెద్ద పేరున్న స్కూల్లో చదవాలంటే ఎంత ఫీజు చెల్లించాలో అని తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఆ స్కూల్లో ఫీజుకు బదులు ప్లాస్టిక్ ఇస్తే చాలు పిల్లలకు విద్య నేర్పిస్తారు. ఈ స్కూల్ ఎక్కడో కాదు మన దేశంలోనే ఉంది. ఫీజుకు బదులు ప్లాస్టిక్‌‌ను సేకరిస్తూ, ఓ వైపు పర్యావరణాన్ని రక్షిస్తూనే మరోవైపు విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తోంది. అదే అస్సాంలోని అక్షర్ అనే స్కూల్. వివరాల్లోకి వెళ్తే.. 2016లో పర్మిత శర్మ మజిన్‌ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికులు ఆలోచనలకు ఫలితంగా రూపు రుద్దుకున్నదే ఈ అక్షర్ అనే స్కూల్.

ఈ పాఠశాలలో ఫీజుకు బదులుగా ప్లాస్టిక్‌ను సేకరిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఫీజుకు బదులు ప్లాస్టిక్‌ని తీసుకుంటూ పర్యావరణహితమైన పాఠశాలగా ఈ పాఠశాల ప్రశంసలను అందుకుంటోంది. ఈ పాఠశాలలో చదువు తోపాటుగా పిల్లల్లో మెరుగైన స్కిల్స్, పర్యావరణ స్పృహని పెంపొందిస్తూ ఈ పాఠశాలను నడుపుతున్నారు. ఇక డబ్బులకు బదులుగా వాడి పారేసిన ప్లాస్టిక్‌ని తీసుకుని రమ్మని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సూచిస్తారు.

ఎంత ఎక్కువ ప్లాస్టిక్‌ని తీసుకుని వస్తే అంత ఎక్కువగా ఫీజు చెల్లించినట్లుగా రసీదు ఇస్తారు. ఈ పాఠశాలకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ పాఠశాలలో వయసును బట్టి కాకుండా పర్యావరణం పట్ల స్పృహ, చదువుపై అవగాహన స్థాయిని బట్టి వారి తరగతులను నిర్ణయిస్తారు. గతంలో అస్సాంలో ఉన్న చలి తీవ్రతను తట్టుకునేందుకు ప్లాస్టిక్‌ను కాల్చేవారు. దీనితో కాలిన ప్లాస్టిక్ నుండి విడుదలైన విషవాయువుల కారణంగా పిల్లలు అనారోగ్యం బారినపడడం గమనించిన సామాజిక కార్యకర్త పర్మిత శర్మకు ఓ ఆలోచన తట్టింది. తన మిత్రుడు మజిన్‌‌తో ఆ ఆలోచన పంచుకుంది. అలా వారిద్దరి ఆలోచనలతో అక్షర్ అనే స్కూల్ ప్రారంభమైంది. 

Similar News