వంశీ 'పసలపూడి కథల'పై పరిశోధన.. రామచంద్రా రెడ్డికి డాక్టరేట్

ప్రముఖ సినీ దర్శకులు వంశీ రాసిన ‘పసలపూడి కథల’పై పరిశోధనకు గాను కె. రామచంద్రా రెడ్డి అనే లెక్చరర్ తాజాగా డాక్టరేట్ పొందారు.

Update: 2022-07-30 06:57 GMT

దిశ, సినిమా : ప్రముఖ సినీ దర్శకులు వంశీ రాసిన 'పసలపూడి కథల'పై పరిశోధనకు గాను కె. రామచంద్రా రెడ్డి అనే లెక్చరర్ తాజాగా డాక్టరేట్ పొందారు. వంశీ సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లాలోని 'పసలపూడి' కాగా.. సమీప గ్రామం 'గొల్లల మామిడాడ'కు చెందిన రామచంద్రారెడ్డి 24 ఏళ్లుగా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పసలపూడి కథలపై మక్కువ పెంచుకున్న ఆయన ఇదే టాపిక్‌పై పీహెచ్‌డీ పూర్తిచేసి ఆంధ్రాయూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు. ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోని హిబ్రూ యూనివర్సిటీ 'ఈఆర్సీ-నీమ్' ప్రాజెక్టులో సభ్యుడిగా ఉన్న రామచంద్రా రెడ్డి.. 'అమెరికా అట్లాంటా'లోని ఎమొరీ యూనివర్సిటీలో జరిగిన కాన్ఫరెన్స్‌లో పాల్గొని తన పరిశోధనా పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు.

పలు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సెమినార్లలోనూ పాల్గొని రీసెర్చ్ పేపర్స్ స‌బ్‌మిట్‌ చేశారు. 'తూర్పుగోదావరి జిల్లా సమగ్ర సాహిత్యం' అనే బృహత్ సంపుటితో పాటు 'తూ గో జిల్లా కథలు.. అలలు' అనే కథా సంపుటికి సహ సంపాదకుడిగా విధులు నిర్వర్తించారు. 1998లో 'రంగుల నింగి' అనే హైకూ సంపుటాన్ని వెలువరించారు. తెలుగు హైకూల్లో సామాజిక అనే అంశంపై ఎంఫిల్ పూర్తి చేసి, ఇప్పుడు వంశీ 'మా పసలపూడి కథలు - ఒక పరిశీలన' అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రచించి మొత్తం ఏడు అధ్యాయాలుగా విభజించారు. ఇందులో రచయితతో ముఖాముఖి, బాపు- రమణల ప్రశంసా కవిత, వంశీ కథలకు బాపు గీసిన బొమ్మలు, కథల్లోని ప్రాంతాల ఫొటోలతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు.

Tags:    

Similar News