'కేసీఆర్‌ను రూ. 2000 నోట్లతో కాల్చిన.. ఇంకా లక్షల కోట్లు మిగులుతాయి'

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో తొక్కుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

Update: 2022-07-06 12:23 GMT

దిశ, ముషీరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో తొక్కుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను రూ. 2000 నోట్లతో కాల్చిన.. ఇంకా లక్షల కోట్లు మిగిలి ఉంటాయని.. ఎందుకు ఈ అవినీతి అని దుయ్యబట్టారు. కేసీఆర్ దోపిడి వల్లే ధరణిలో అవినీతి జరుగుతుందన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు. కేసీఆర్ చేస్తున్న అరాచకాలపై నిరంతరం పోరాడుతామని తెలిపారు. కేసీఆర్‌కు ఎంతసేపటికి దోచుకోవడమే తప్ప వేరే ఆలోచన లేదని ఆరోపించారు. నేనెక్కడికి వెళ్తే అక్కడికి ఇంటలెన్స్ వాళ్ళను పంపుతున్నారని.. ఒకసారి రైతుల వద్దకు మీ ఇంటలిజెన్స్ వాళ్ళను పంపితే వాళ్ల బాధ ఏంటో అర్థం అవుతుందని అన్నారు. 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో తొక్కి వేస్తామని స్పష్టం చేశారు. పాత రికార్డులన్నీ మాయం చేసి.. రెవెన్యూ వ్యవస్థను ఆగం చేశాడని మండిపడ్డాడు.

ధరణి పోర్టల్ ద్వారా మీ భూమిపైకి ఎవరన్న వస్తే.. తిరగబడండి అని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. రెవెన్యూ సదస్సులు అని కేసీఆర్ కొత్త డ్రామా అని, కేసీఆర్ మాయలోడు మాయమాటలు చెప్తే ఎవరు నమ్మరన్నారు. ధరణి అద్భుతం అని, సర్వరోగ నివారిణి అని కేసీఆర్ చెప్పిండని గుర్తు చేశారు. ముచ్చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ లో ధరణి మొదలు పెట్టి పేదలకు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్ ను వివిధ కారణాలతో గుంజుకుంటున్నారని విమర్శించారు. లక్ష్మాపూర్ గ్రామం రెవెన్యూలో లేదని, 800 మందికి పట్టాలివ్వకపోతే నేనే కొట్లాడితే 200 మందికి ఇచ్చారన్నారు.

పేద ప్రజలు ఆత్మగౌరవంగా బతకాలని ఒకేసారి కాంగ్రెస్ 25లక్షల ఎకరాల భూములను పంచిందన్నారు. తెలంగాణలో మొత్తం 30లక్షల ఎకరాల భూమి మాయం అయ్యిందని ఆరోపించారు. కేసీఆర్‌ను సీఎం పదవిలో కూర్చోబెట్టింది.. పేదల భూములను గుంజుంకోడానికేనా అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో నయా భూస్వాములు తయారవుతున్నారు. ఈ ధర్నాలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మధు యాష్కీ, కోడందరెడ్డి, కిసాన్ కమిటి అల్ ఇండియా ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News