ఆ నేత చేరిక చెల్లదు.. కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికల రాజకీయం చర్చకు దారి తీస్తోంది.

Update: 2024-04-27 09:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికల రాజకీయం చర్చకు దారి తీస్తోంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ టి.భార్గవ్ చేరికకు కాంగ్రెస్ అధిష్టానం బ్రేక్ వేసింది. శనివారం 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో భార్గవ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్సి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్దిసేపటికే ఆయన చేరికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీపాదాస్ మున్షీ సలహా మేరకు భార్గవ్ చేరికను నిలుపుదల చేశామని.. నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆయన చేరికపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు చేరే వరకు భార్గవ్ చేరిక నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.




 



చేరికలపై అభ్యంతరాలు:

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరికలపై కొన్ని చోట్ల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం చర్చగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ గౌడ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఆయన చేరికపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ చేరికను సైతం అధిష్టానం నిలిపివేసింది. ఈ క్రమంలోనే తాజాగా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చేరికకు సైతం బ్రేకులు వేయడంతో చేరికల కాంగ్రెస్ పార్టీలో చేరికల వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అయితే రెండు రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ లో చేరికలపై ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డిలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ లో చేరికల వ్యవహాలు ఈ ముగ్గురే చూసుకోనున్నట్లు తెలిపారు. ఇంతలో బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు పార్టీలో చేరుతామంటూ కండువాలు కప్పుకున్న తర్వాత వారిని చేరిక చెల్లదంటూ ప్రకటనలు రావడం సంచలనంగా మారుతోంది.

Tags:    

Similar News